
హైదరాబాద్, జూన్ 11: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026 ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. మే 24వ తేదీన యూపీఎస్సీ సివిల్ సర్వీసెట్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 5.49 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 933 ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష జరిగిన నాలుగు రోజులకే అంటే మే 28న ప్రాథమిక ఆన్సర్ కీలను విడుదల చేసిన కమిషన్ ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ప్రాథమిక కీలో ఒక ప్రశ్నను తొలగించగా, దానికి సంబంధించి అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు కేటాయించనున్నారు.
ఈ పరీక్ష ఫలితాలు జూన్ 15 లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్సైట్లో ఫలితాలనుచెక్ చేసుకోవడానికి అభ్యర్ధుల రోల్ నంబర్ల జాబితాతో కూడిన పీడీఎఫ్ ఫైల్ యూపీఎస్సీ విడుదల చేస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. వీరికి మెయిన్స్ పరీక్షలను ఆగస్టు 21, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ఖాళీల సంఖ్యకు 10 నుంచి 15 రెట్ల మందిని మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఈసారి ఎంత మందిని మెయిన్స్కు అనుమతిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కటాఫ్ పెరుగుతుందా? తగ్గుతుందా?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కటాఫ్ కేవలం జనరల్ స్టడీస్ పేపర్ 1 ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారు. CSAT పేపర్ 2 కేవలం అర్హత సాధించడానికి మాత్రమే. ఈ పేపర్లో ప్రతి ఒక్కరూ 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇక ఈ ఏసారి ప్రిలిమ్స్ పేపర్ కఠినంగా రావడంతో కటాఫ్ భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తు్న్నారు.