Reading Time: 3 minutes
India Deploys 12 Nuclear Warheads Strategic Shift In No First Use Policy Amid China Pakistan Threat Explained

Explainer: భారత్ అణు విధానంలో ఒక పెద్ద మార్పు జరిగిందా..? దాదాపు అర్థ శతాబ్దంగా ప్రపంచానికి ఒకే సందేశం ఇస్తున్న భారత్… ఇప్పుడు తన అణు వ్యూహాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోందా..? ఎందుకంటే తాజాగా బయటకు వచ్చిన SIPRI నివేదిక ప్రపంచ రక్షణ రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటివరకు అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంగా మాత్రమే కనిపించిన భారత్… ఇప్పుడు వాటిని ఎప్పుడైనా ప్రయోగించగల స్థితిలోకి తీసుకొస్తోందని ఆ నివేదిక చెబుతోంది. అది కూడా ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 12 అణు వార్‌హెడ్లు.

ఇంతకీ అసలు అణుబాంబును డిప్లాయ్ చేయడం అంటే ఏంటి? భారత్ ఇప్పటివరకు ఎందుకు అలా చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తోంది? చైనా భయమా? పాకిస్థాన్ ఒత్తిడా? లేక ప్రపంచంలో మొదలైన కొత్త అణు పోటీకి భారత్ కూడా సిద్ధమవుతోందా? ఈ కథ అర్థం కావాలంటే మనం 51 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.

పోఖ్రాన్‌లో ఏం జరిగింది?

అది 1974 మే 18. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో భారత్ మొదటి అణు పరీక్ష నిర్వహించింది. స్మైలింగ్ బుద్ధ పేరుతో జరిగిన ఆ పరీక్షతో భారత్ అణు శక్తి ఉన్న దేశాల జాబితాలో చేరింది. కానీ అప్పటికి భారత్ అధికారికంగా అణ్వాయుధ దేశం కాదు. ఆ తర్వాత మరో 24 సంవత్సరాలు ప్రపంచ ఒత్తిళ్లు, ఆంక్షలు, దౌత్యపరమైన వివాదాల మధ్య గడిచిపోయాయి. 1998లో మళ్లీ పోఖ్రాన్ ఎడారే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వరుసగా ఐదు అణు పరీక్షలు నిర్వహించిన భారత్ తన అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి బహిరంగంగా చూపించింది. అప్పటి నుంచి భారత్ అధికారిక అణ్వాయుధ దేశంగా మారింది.

కానీ ఇక్కడే భారత్ మిగతా దేశాల కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అమెరికా, రష్యా లాంటి దేశాలు వేలాది అణ్వాయుధాలను ఎప్పుడూ ప్రయోగానికి సిద్ధంగా ఉంచుతుంటే… భారత్ మాత్రం అణుబాంబులు ఒకచోట, వాటిని ప్రయోగించే క్షిపణులు మరోచోట నిల్వ చేసే విధానాన్ని అనుసరించింది. ఎందుకంటే భారత్ అణ్వాయుధాలను యుద్ధం కోసం కాదు… కేవలం నిరోధక శక్తిగా మాత్రమే ఉపయోగిస్తామని ప్రకటించింది. దీనికే నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతం అని పేరు. అంటే ఎవరైనా ముందుగా భారత్‌పై అణు దాడి చేస్తే మాత్రమే భారత్ ప్రతిదాడి చేస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

పెరుగుతున్న అణ్వాయుధాల సంఖ్య:

ఒకప్పుడు ప్రపంచంలో అణ్వాయుధాల సంఖ్య తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అమెరికా, రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్… దాదాపు అన్ని అణ్వాయుధ దేశాలు తమ ఆయుధాలను ఆధునీకరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 12 వేలకుపైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిలో అత్యధికం అమెరికా, రష్యా వద్దే ఉన్నాయి. కానీ అత్యంత వేగంగా పెరుగుతున్న అణు శక్తి మాత్రం చైనా. 2010లో చైనా వద్ద సుమారు 240 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య 600 దాటింది. వచ్చే పదేళ్లలో వెయ్యికి చేరవచ్చని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. వందల సంఖ్యలో కొత్త క్షిపణి సైలోలు, కొత్త తరం అణు జలాంతర్గాములు, హైపర్‌సోనిక్ క్షిపణులు… ఇలా చైనా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఇక పాకిస్థాన్ పరిస్థితి కూడా భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే.

ఎందుకంటే అణ్వాయుధాలను వినియోగించే విషయంలో పాకిస్థాన్ భారత్ లాంటి నో ఫస్ట్ యూజ్ హామీ ఇవ్వలేదు. అంటే భారత్ ఒకేసారి రెండు అణ్వాయుధ దేశాలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉంది. అందుకే కొన్నేళ్లుగా భారత్ తన న్యూక్లియర్ ట్రైయాడ్‌ను బలోపేతం చేస్తోంది. ట్రైయాడ్ ప్లాన్‌ను ఎంచుకోంది. అంటే భూమి, ఆకాశం, సముద్రం నుంచి… మూడు మార్గాల్లోనూ అణుదాడి చేయగల సామర్థ్యమని అర్థం. అగ్ని సిరీస్ క్షిపణులు భూమి ఆధారిత శక్తి అయితే… యుద్ధ విమానాలు గగనతల సామర్థ్యం. ఇక అరిహంత్ తరగతి అణు జలాంతర్గాములు సముద్ర ఆధారిత శక్తికి ప్రతీక.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సముద్రంలో తిరిగే అణు జలాంతర్గాములను గుర్తించడం చాలా కష్టం. శత్రువు మొదటి దాడిలో భూమిపై ఉన్న స్థావరాలు ధ్వంసమైనా… సముద్రంలో ఉన్న జలాంతర్గాములు ప్రతిదాడి చేయగలవు. అందుకే ప్రపంచంలోని అన్ని అణు శక్తులు ఇప్పుడు సముద్ర ఆధారిత నిరోధక వ్యవస్థలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. గతేడాది ఇది 180గా అంచనా వేశారు. అంటే సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కానీ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం సంఖ్య కాదు. ఆ 190లో 12 వార్‌హెడ్లు తొలిసారి డిప్లాయ్‌డ్ కేటగిరీలోకి వెళ్లినట్లు అంచనా వేయడమే.

డిప్లాయ్‌డ్ అంటే యుద్ధం ప్రారంభమైందని కాదు. అవి అవసరమైతే వెంటనే ప్రయోగించగల స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని అర్థం. అంటే భారత్ తన నో ఫస్ట్ యూజ్ విధానాన్ని మార్చేసిందా? ఇప్పటికైతే లేదనే చెప్పవచ్చు. భారత్ ఇప్పటికీ నో ఫస్ట్ యూజ్ విధానాన్ని కొనసాగిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం మళ్లీ అణు పోటీ దిశగా వెళ్తోంది. చైనా వేగంగా బలపడుతోంది. పాకిస్థాన్ తన వ్యూహాన్ని మార్చుకోవడం లేదు.

ఇలాంటి సమయంలో భారత్ కూడా కేవలం అణుబాంబులు కలిగి ఉండటం సరిపోదని, అవి అవసరమైన సమయంలో వెంటనే స్పందించే స్థితిలో ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ 12 అణ్వాయుధాల కథ కేవలం ఒక రక్షణ రంగానికి చెందిన విషయంలా కాకుండా ఆసియాలో శక్తి సమీకరణాలు ఎలా మారుతున్నాయో చెప్పే పెద్ద సంకేతంగా చెప్పవచ్చు.