
YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించిన ఆయన, బాధిత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రానికి రెండు లేఖలు కూడా రాశామని అన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు, కార్మికుల పక్షాన నిలిచింది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఈ అంశంపై గట్టిగా కోరినట్లు వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్లో గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని జగన్ ఆరోపించారు. ఒకప్పుడు 28 వేల మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం సుమారు 10,500 మందిని తొలగించారని చెప్పారు. ప్రస్తుతం కాంట్రాక్ట్, రెగ్యులర్ కార్మికులు మాత్రమే మిగిలి ఉన్నారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని కూటమి ప్రభుత్వ నేతలు చెబుతున్నారని, అయితే ఆ నిధులను స్వచ్ఛంద పదవీ విరమణ (VRS), బ్యాంకు రుణాల చెల్లింపులకే వినియోగించారని విమర్శించారు. ప్లాంట్ నిర్వహణ, భద్రతా చర్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన ప్రమాదానికి రా మెటీరియల్ లోపాలు, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని జగన్ అన్నారు. లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. 14 నెలల క్రితం స్టీల్ ప్లాంట్లో ప్రాణాలు కోల్పోయిన మాస్టర్ టెక్నీషియన్ పెంటయ్య కుటుంబానికి ఇప్పటికీ పరిహారం అందలేదని జగన్ ఆరోపించారు. పరిహారం గురించి అడిగితే ఫైలు పోయిందని సమాధానం ఇచ్చారని విమర్శించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులకు తమ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని గుర్తు చేసిన జగన్, అదే తరహాలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని జగన్ కోరారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలు కొంత ఓపిక పట్టాలని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కోటి రూపాయల పరిహారం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ గాజువాకలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి బయలుదేరారు.