
EPFO New Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత సౌకర్యాన్ని కల్పించే దిశగా కీలక మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా PF క్లెయిమ్లు, విత్డ్రాయల్స్కు సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సభ్యులు తమ PF ఖాతాలోని 100 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. గతంలో పూర్తి PF మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే సభ్యులు కారణాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా సమర్పించాల్సి వచ్చేది. నిరుద్యోగం, కంపెనీ మూసివేత, ప్రకృతి వైపరీత్యాలు, లాక్డౌన్ వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పూర్తి ఉపసంహరణకు అనుమతి ఉండేది. అయితే కారణాలు EPFO నిబంధనలకు అనుగుణంగా లేకపోతే క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.
100 శాతం PF విత్డ్రా ఎప్పుడు సాధ్యం?
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పూర్తి PF మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఒక సంస్థ 15 రోజుల కంటే ఎక్కువ కాలం లాక్డౌన్లో ఉండటం, మూతపడటం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడం, లేదా రెండు నెలలకుపైగా జీతాలు చెల్లించకపోవడం వంటి సందర్భాల్లో ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఉద్యోగం నుంచి తొలగించబడిన లేదా ఉద్యోగ కోతకు గురైన ఉద్యోగులు, ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసినట్లయితే కూడా పూర్తి ఉపసంహరణకు అర్హులవుతారు. సంస్థ ఆరు నెలలకుపైగా మూతపడి ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. కుటుంబ సభ్యుల లేదా సభ్యుని వైద్య చికిత్స కోసం కూడా 100 శాతం PF మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల్లో ఏమి మారింది?
2025 అక్టోబర్ 13న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రత్యేక పరిస్థితుల కేటగిరీలో PF విత్డ్రా కోసం సభ్యులు కారణాన్ని వివరించాల్సిన నిబంధనను EPFO తొలగించింది. గతంలో కారణాలను సమర్పించడంలో ఏర్పడే సాంకేతిక సమస్యలు, క్లెయిమ్ తిరస్కరణలు, ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అర్హత ఉన్న సభ్యులు అదనపు వివరణ ఇవ్వకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతున్నారు.
సాధారణ పరిస్థితుల్లో ఎంత వరకు విత్డ్రా చేసుకోవచ్చు?
కొత్త సడలింపులు వచ్చినప్పటికీ, సాధారణ పరిస్థితుల్లో మొత్తం PF బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదు. EPFO నిబంధనల ప్రకారం అర్హత ఉన్న మొత్తంలో 75 శాతం వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అక్టోబర్ 15, 2025న విడుదల చేసిన మరో మార్గదర్శకం ప్రకారం, ఈ 75 శాతం వరకు ఉపసంహరణకు ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. EPFO తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగవంతం కావడంతో పాటు, సభ్యులకు తమ పొదుపులపై మరింత నియంత్రణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే క్లెయిమ్ తిరస్కరణలు తగ్గి, సేవల పారదర్శకత కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.