Reading Time: 2 minutes
Kc Venugopal Denies Tmc Congress Merger Sonia Mamata Meeting Clarification

కాంగ్రెస్‌లో తృణమూల్ కాంగ్రెస్ విలీనంపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. విలీనంపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన మాట వాస్తవమే కానీ.. అది ఒక సాధారణ సమావేశం మాత్రమేనని స్పష్టం చేశారు. విలీనం గురించి ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు.

‘‘రాబోయే 2-3 నెలల్లో మేము జాతీయ స్థాయిలోనే కాకుండా.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. అక్కడ కాంగ్రెస్ వారి ఆవేదనలో భాగస్వామి అవుతుంది. వారి తరఫున పోరాడుతుంది.’’ అని అన్నారు.

‘‘ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ (PCC) అధ్యక్షులతో మూడు గంటల పాటు సమావేశం జరిగింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమైనవి. మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించిన అంశం దీనికి ఒక ఉదాహరణ. కోర్టు పంపిన ఒక నోటీసును వెల్లడించలేదన్న కారణంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు, ఎఫ్‌ఐఆర్ (FIR) లేదా ఛార్జ్ షీట్ నమోదు కాలేదు. మరోవైపు జార్ఖండ్‌లో బీజేపీ మద్దతు ఉన్న ఒక కార్పొరేట్ అభ్యర్థి, కనీసం తన పేరును కూడా సరైన కాలమ్‌లో నమోదు చేయనప్పటికీ.. రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను ఆమోదించారు… ఇది ప్రజాస్వామ్య దుస్థితిని తెలియజేస్తోంది… ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చించాము, దీనిపై మేము రాజకీయంగా పోరాడుతాము..’’ అని పేర్కొన్నారు.