
రాగ్ మయూర్ హీరోగా ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అనుమాన పక్షి’. మెరీన్ హీరోయిన్గా నటించగా, సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్ర పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు.
ఇందులో ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా రాగ్ మయూర్ పాత్రను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. తన క్యారెక్టర్ను డిఫరెంట్గా ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. తన అనుమాన స్వభావం వల్ల వరుసగా జరిగే విచిత్రమైన, హాస్యభరితమైన, గందరగోళ సంఘటనలతో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.
హీరోయిన్ మెరిన్ ఫిలిప్ గ్లామరస్ లుక్లో ఇంప్రెస్ చేయగా, ప్రిన్స్, రాశి, అజయ్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, మస్త్ అలీ తమ తమ పాత్రల్లో అలరించారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు టీజర్లోని వినోదాన్ని మరింత పెంచింది. ఈ ‘అనుమాన పక్షి’ టీజర్ నవ్వులు పంచే వినోదభరిత ప్రయాణానికి ఆహ్వానం పలుకుతూ.. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మేకర్స్ చెప్పారు. జులై 10న సినిమా విడుదల కానుంది.