Reading Time: 2 minutes
Mumbai Kem Hospital Orders Inquiry Into Mbbs Student Sejal Pawar Cadaver Video Remarks

Sejal Pawar: నోటికి వచ్చినట్లు చెత్త కూతలు కూసిన ఒక వైద్య విద్యార్థినిపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే.. స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే షోలో మెడికల్ కాలేజీలకు వైద్య విద్యాభ్యాసం కోసం దానం చేసిన పురుషుల మృతదేహాల జననేంద్రియాల పరిమాణంపై ఎంబీబీఎస్ విద్యార్థిని సెజల్ పవార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సైబర్ విభాగం.. కమెడియన్ ప్రణిత్ మోరే, హిమాన్షు జాంగ్రాతో పాటు సెజల్ పవార్‌పై నోడల్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. BNS 2023తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, నిందితులకు సమన్లు జారీ చేశారు.

కేఈఎమ్ హాస్పిటల్ సీరియస్..

మరోవైపు సెజల్ పవార్ చదువుతున్న ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. సీనియర్ డాక్టర్లు, వైద్య వర్గాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. వైద్య విద్యార్థుల కోసం ఎంతో ఉదారతతో దానం చేసే మృతదేహాలను దైవంగా భావిస్తామని, అలాంటి వాటిపై నవ్వుల కోసం ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని వైద్యులు మండిపడుతున్నారు. దీనిపై కేఈఎమ్ హాస్పిటల్ డీన్ స్పందిస్తూ.. “ఒక వైద్య విద్యార్థిని ఒక కామెడీ షోలో చాలా సున్నితమైన విషయాలపై చెత్త వ్యాఖ్యలు చేసినట్లు మాకు సమాచారం అందింది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఇద్దరు మహిళా ప్రొఫెసర్లతో (డాక్టర్ అనితా చలక్, డాక్టర్ శ్రద్ధా మోరే) కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సోషల్ మీడియా మార్గదర్శకాల ప్రకారం విచారణ నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం సెజల్‌ను సస్పెండ్ చేయనప్పటికీ, గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు యాజమాన్యం రెడీ అయ్యింది.

రక్షణగా నిలిచిన రెసిడెంట్ డాక్టర్ల సంఘం (MARD).. కానీ

ఈ వివాదంపై మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (MARD) స్పందిస్తూ.. సెజల్ చేసిన కామెంట్స్ వైద్య వృత్తికి తగనివని పేర్కొంది. అయితే ఇప్పటికే సెజల్ పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పి, లెటర్ సమర్పించినందున ఆమెపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్, ఆమె రిజర్వేషన్ కోటా సీటును టార్గెట్ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఇదే సమయంలో మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ సంఘం వాళ్లు మాట్లాడుతూ.. విమర్శలు హుందాగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో ఇదే షోలో ‘రూ.370 బిర్యానీ డేట్’ వివాదంలో చిక్కుకున్న హిమాన్షు జాంగ్రాను ఇప్పటికే ఒక కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించగా.. ఇప్పుడు సెజల్ పవార్ చట్టపరమైన, కాలేజీ పరమైన చర్యలను ఎదుర్కొంటోంది.