Reading Time: < 1 minute
Bengal Government May Remove Mamata Banerjee Books From State Libraries

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ముక్కలైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదీ మాటను వినే పరిస్థితుల్లో లేరు. ఇక ఎన్నికల సమయంలో మతవిద్వేషాలు పెంచేలా కామెంట్స్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అవినీతిపై విచారణ మొదలైంది.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బెంగాల్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పుస్తకాలను ప్రభుత్వం లైబ్రరీల నుంచి తొలగించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ గ్రంథాలయ సేవల మంత్రి గౌరీ శంకర్ ఘోష్ చెప్పారు. జ్ఞానం, మేధో వికాసం, జాతీయవాద భావాలకు దోహదపడే పుస్తకాలు లైబ్రరీల్లో ఉంచబోతున్నట్లు చెప్పారు. ‘ఎపాంగ్ ఓపాంగ్ ఝపాంత్’ వంటి పుస్తకాలకు లైబ్రరీల్లో చోటు ఉండదని స్పష్టం చేశారు. రవీంద్రనాథ్ టాగోర్, కాజీ నజ్రుల్ ఇస్లాం, స్వామి వివేకానంద వంటి సాహిత్య, ఆధ్యాత్మిక దిగ్గజాల రచనలతో పాటు, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ వంటి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో ఏడాది క్రితం లైబ్రరీల్లో ఆమె రచించిన పుస్తకాలను చేర్చాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2025లో టీఎంసీ సర్కార్ పాఠశాల లైబ్రరీల కోసం 515 పుస్తకాలను ఆమోదించింది. వీటిలో 90 పుస్తకాలు మమతా బెనర్జీ రచించినవే. ఇప్పుడు వీటిని తొలగించేందుకు బీజేపీ సర్కార్ సిద్ధమైంది.