
ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశాభివృద్ధి, సమగ్ర మానవ వనరుల పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు.
వికసిత్ భారత్ లక్ష్యం
నీతి ఆయోగ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… ఈ ఏడాది సమావేశం ప్రధాన అంశం “విక్షిత్ భారత్ @2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి”. వయస్సు, ప్రాంతం, లింగం, సామాజిక-ఆర్థిక నేపథ్యం వంటి భేదాలు లేకుండా ప్రతి పౌరుడి సంక్షేమాన్ని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను విస్తరించడంపై చర్చించారు.
నాలుగు కీలక స్తంభాలపై చర్చ
సమగ్ర మానవ అభివృద్ధి కోసం రూపొందించిన కార్యాచరణ నాలుగు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందని నీతి ఆయోగ్ తెలిపింది.
మానవ వనరుల అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు
ఉత్పాదక ఉపాధి, వ్యవస్థాపకత, వికేంద్రీకృత అభివృద్ధి
ఆరోగ్యం, పోషకాహారం, సమగ్ర సంక్షేమం
అందరికీ సమాన అవకాశాలు, గౌరవప్రద జీవనం
డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి
పాలన వ్యవస్థలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI), భాగస్వామ్యాలు, డేటా ఆధారిత విధానాల ద్వారా అమలు ప్రణాళికను రూపొందించడంపై కూడా చర్చ జరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికలను జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయడం, సమన్వయంతో ముందుకు సాగడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. అలాగే 2025 డిసెంబర్లో జరిగిన 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సులో వచ్చిన సిఫార్సులను కూడా సమావేశంలో సమీక్షించారు. ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు, పాఠ్యేతర కార్యక్రమాల అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చలు జరిగినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.
ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులు, సీఈఓ హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హర్యానా సీఎం సైనీతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడి సతీశన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Chairing the 11th meeting of the Governing Council of NITI Aayog.
Guided by the spirit of cooperative federalism, we are working together to accelerate India’s development journey. The collective efforts of the Centre and States will play a pivotal role in realising our shared… pic.twitter.com/xh7nFX8qyH
— Narendra Modi (@narendramodi) June 11, 2026
