Reading Time: < 1 minute
Iran Warns Us Of Painful Consequences After Trump Fresh Threats

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 28న సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతం చేశాయి. అనంతరం ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా తిరిగి మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇరాన్-అమెరికా పరస్పరం కవ్వించుకుంటున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికి భీకర దాడులుంటాయని వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు ట్రంప్‌నకు కౌంటర్‌గా ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా తీసుకునే ఏ కొత్త చర్యకైనా మరింత బలమైన, బాధాకరమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. టెహ్రాన్‌పై అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపడితే.. బాధాకరమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ చట్టసభ సభ్యుడు హెచ్చరించారు. వాషింగ్టన్ నుంచి ఎలాంటి కొత్త దురాక్రమణ జరిగినా దానికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిటీ అధిపతి హెచ్చరించారు. ఒత్తిడికి లొంగబోమనే టెహ్రాన్ వైఖరిని నొక్కిచెప్పారు. కొనసాగుతున్న సంఘర్షణలో ట్రంప్ చివరికి లొంగిపోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ… లొంగిపోవాల్సింది ఇరాన్ కాదు.. అమెరికాయే అని అన్నారు. ఈ పోరాటంలో నిస్సందేహంగా అమెరికాయే లొంగిపోవాలన్నారు.