
మనం ప్రతిరోజూ పొద్దున లేచింది మొదలు ఎన్నో ఫార్వార్డెడ్ మెసేజ్లను చూస్తుంటాం. కానీ, అసలు ఆ మెసేజ్ ఎక్కడ పుట్టింది? దాన్ని మొదట సృష్టించిన మేధావి ఎవరు? అనేది ఎప్పటికీ మిస్టరీనే. ఈ సస్పెన్స్కు తెరదించుతూ, ఫార్వార్డింగ్ మెసేజ్లలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి మెటా యాజమాన్యం సిద్ధమవుతోంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ సోషల్ మీడియా ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది.
ఫీచర్ వెనుక ఉన్న అసలు కథేంటి?
ప్రస్తుతం మనకు వచ్చే ఫార్వార్డ్ మెసేజ్లపై కేవలం ఫార్వార్డెడ్ అనే లేబుల్ మాత్రమే కనిపిస్తుంది. కానీ, కొత్త అప్డేట్ ప్రకారం.. ఒక మెసేజ్ను ఫార్వార్డ్ చేసినప్పుడు, దానిని అసలు మొదట క్రియేట్ చేసిన వ్యక్తి పేరు, వారి ఫోన్ నంబర్ కూడా అవతలి వారికి తెలిసిపోయే అవకాశం ఉంది. ప్రాథమికంగా వాట్సాప్ బిజినెస్ యూజర్ల నుంచి వచ్చే మెసేజ్ల విషయంలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించనుంది.
ఈ సరికొత్త ప్రయోగం వల్ల సమాజానికి జరిగే మేలు తక్కువేమీ కాదు. ముఖ్యంగా.. మనకు వచ్చిన సమాచారం నిజమైనదా కాదా అని నిర్ధారించుకోవడం సులువవుతుంది. వాట్సాప్లో దావాగ్నిలా వ్యాపించే తప్పుడు ప్రచారాలు, స్కామ్లు, ఫేక్ న్యూస్ల మూలాలను పట్టుకోవడం ఈ ఫీచర్ ద్వారా చాలా సులభం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు, ఈ ఫీచర్పై నెటిజన్ల నుంచి, ముఖ్యంగా రెడిట్ వంటి ప్లాట్ఫారమ్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చాలామంది దీనిని వ్యక్తిగత గోప్యతకు భంగంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే, ఒక వ్యక్తి తన వ్యక్తిగత భద్రత లేదా గోప్యతను ఆశించి పంపిన సమాచారం.. చేతులు మారి వేరొకరి వద్దకు వెళ్ళినప్పుడు వారి ఫోన్ నంబర్, పేరు అందరికీ బహిర్గతం కావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఫీచర్ ఇంకా పూర్తిస్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం టెస్టింగ్ దశలోనే ఉంది. పారదర్శకత ఎంత ముఖ్యమో, యూజర్ల ప్రైవసీని కాపాడటం కూడా అంతే ముఖ్యం కాబట్టి, మెటా సంస్థ ఈ రెండింటి మధ్య ఎలాంటి సమతుల్యత పాటిస్తుందో వేచి చూడాలి.