
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకురావడానికి మరో ద్రవిడ్ సిద్ధమయ్యాడు. ద్రావిడ్ చిన్న కుమారుడు, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన అన్వయ్ ద్రవిడ్ వచ్చే నెలలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. శరత్ శ్రీధరన్ నేతృత్వంలోని జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ గురువారం ఈ ద్వైపాక్షిక సిరీస్ కోసం జట్లను అధికారికంగా ప్రకటించింది. జూలై 4, 2026 నుంచి హంబన్తోట వేదికగా ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్లు ఆడనుంది.
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన..
17 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన అన్వయ్ ద్రవిడ్, గత కొంతకాలంగా దేశవాళీ వయోపరిమితి (ఏజ్-గ్రూప్) క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగానే అతనికి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టులో చోటు లభించింది. ఈ జట్టులో రజత్ బాఘేల్తో పాటు అన్వయ్ రెండవ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు సారథ్యం వహించనుండగా, లక్ష్య రాయ్చందానీ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
అన్వయ్ అన్న సమిత్ ద్రావిడ్ గతంలో కర్ణాటక తరపున అండర్-19 క్రికెట్ ఆడినప్పటికీ, జాతీయ జట్టుకు పిలుపు అందుకున్న మొదటి సోదరుడు అన్వయ్ కావడం విశేషం. ఇటీవల జరిగిన ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో అన్వయ్ కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి, జట్టును క్వార్టర్ ఫైనల్స్కు చేర్చాడు. ఆ టోర్నీలో మిడిల్ ఆర్డర్ యాంకర్గా రాణించి 6 ఇన్నింగ్స్ల్లో 220 పరుగులు చేశాడు. హిమాచల్ ప్రదేశ్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించి అతను చేసిన 82 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో కూడా అన్వయ్ సెంచరీ సాధించాడు.
భవిష్యత్తు ప్రపంచకప్కు పునాది..
రాబోయే అండర్-19 ప్రపంచకప్ కొత్త డెవలప్మెంట్ సైకిల్కు ఈ శ్రీలంక పర్యటనే పునాది అని జాతీయ సెలక్టర్లు భావిస్తున్నారు. వయసు రీత్యా అన్వయ్కు మరో రెండేళ్లపాటు అండర్-19 ఆడే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే మెగా టోర్నీకి ఉపఖండ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఈ పర్యటన అతనికి ఎంతో కీలకం కానుంది. భారత జట్టు జూన్ చివరి వారంలో శ్రీలంకకు పయనం కానుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రెడ్-బాల్ మల్టీ-డే మ్యాచ్లు ప్రారంభమవుతాయి.