Reading Time: < 1 minute
Ap Liquor Scam Ed Takes A1 Accused Raj Kesireddy Into Custody Intensifies Money Laundering Probe

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (A1)గా ఉన్న రాజ్ కేశిరెడ్డిని ఈడీ అధికారులు నేడు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారులు రాజ్ కేశిరెడ్డి వద్ద కీలక వివరాలను సేకరిస్తున్నారు. లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ బృందాలు హైదరాబాద్ జోన్ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. రాజ్ కేశిరెడ్డి నివాసంతో పాటు అతనికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

సోదాల సందర్భంగా రాజ్ కేశిరెడ్డి ఇంటి నుంచి పలు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులు, ఇతర ఆధారాలను సేకరించినట్లు సమాచారం. వీటి ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు. దర్యాప్తులో భాగంగా అక్రమ లిక్కర్ రవాణా టెండర్ల కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కేటాయించి, సొంత లాభాలు, అనుచరుల ప్రయోజనాల కోసం వ్యవహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

తనిఖీల సమయంలో రూ.8 లక్షల నగదుతో పాటు రెండు విలాసవంతమైన రోలెక్స్ వాచీలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని లగ్జరీ కార్లు కూడా గుర్తించినట్లు సమాచారం. వీటి కొనుగోలు, ఆర్థిక వనరులపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు ఈడీ మూడు దఫాలుగా సోదాలు నిర్వహించింది. ఈ కేసులో భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.