
హైదరాబాద్, వెలుగు: డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) పూర్తి చేసింది. ఎంపికైన డాక్టర్ల ఫైనల్ లిస్టును బోర్డు బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్మెంట్లకు సంబంధించి మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొదట అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ఇప్పటికే పూర్తయింది.
వారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన 30 విభాగాల్లోని 433 పోస్టులతో పాటు, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల సెలక్షన్ లిస్టులను కూడా బోర్డు తాజాగా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు లేక కొన్ని పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు. ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లలో ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. మరికొన్ని విభాగాల్లో రోస్టర్ పాయింట్ల ప్రకారం అభ్యర్థులు దొరక్క ఖాళీలు మిగిలిపోయాయి. వీటిని తదుపరి నోటిఫికేషన్ లో భర్తీ చేయనున్నారు.
- త్వరలోనే నియామక పత్రాలు: దామోదర
కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.