Reading Time: 2 minutes
Off The Record About Brs Faces Setback In Bodhan Where Is Shakeel Cadre Upset Over Membership Drive Delay

Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో.. గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. మీటింగ్స్‌కు హాజరవుతున్న పార్టీ నేతలంతా ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జట్టుగా, కలిసి కట్టుగా సమావేశాల్లో పాల్గొన్ని క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ఇక్కడ మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్క బోధన్ మినహా అన్ని చోట్ల సమావేశాల నిర్వహణ పూర్తయింది. చివరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ లేని బాన్సువాడలోనూ మూడు మండలాలకు ఓ సమావేశం చొప్పున పూర్తి చేశారు. కానీ… మాజీ ఎమ్మెల్యే షకీల్‌ బాధ్యుడిగా ఉన్న బోథన్‌లో మాత్రం పట్టించుకునే నాధుడే లేడు. అక్కడ అసలు సన్నాహక సమావేశం జరుగుతుందో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయట. ఈనెల 1న మీటింగ్‌ ఉంటుందని ప్రకటించి.. వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ఉంటుందో తెలియదు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీలుకున్న బీఆర్‌ఎస్‌…. ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్‌లను నియమించి రిపోర్టులు తెప్పించుకుంటోంది. బోధన్‌లో మాత్రం సమావేశం జరగకపోవడం, ఇన్ఛార్జ్‌ షకీల్‌ అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులపై గులాబీ బాస్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు వచ్చినా.. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. ఈ పరిణామాలు నాయకత్వానికి ఇబ్బందిగా మారడంతో పాటు… పార్టీ క్యాడర్ సైతం నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో దుబాయ్ వెళ్లిపోయారు షకీల్‌. అక్కడి వ్యాపారాల్లో బిజీ అయ్యారట. అప్పట్లో ఆయన బోధన్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో మాజీ ఎమ్మెల్యే భార్యే అడపాదడపా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. తర్వాత కొన్నాళ్ళకు తిరిగి వచ్చిన షకీల్‌…. ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో.. తెలియదుగానీ… ఇంకోసారి దుబాయ్ ఫ్లైట్‌ ఎక్కేశారు. అక్కడి బిజినెస్‌ వ్యవహారాల్లో బిజీ అయిపోయి ఇక్కడ పార్టీని గాలికొదిలేశారన్నది కేడర్‌ టాక్‌. తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నా.. ఆయన మాత్రం డుమ్మా కొడుతున్నారు. దీంతో… తమ నియోజకవర్గంలో అసలేం జరుగుతోందో అర్ధంకాక కారు కేడర్‌ గందరగోళపడుతోంది. మాజీ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారంటే పరిస్దితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అంటోంది ద్వితీయ శ్రేణి. బోధన్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్‌గా ఉన్న మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు సైతం ఈ అంశంపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట. దుబాయ్‌తో పాటు జిల్లాలోనూ రైస్ మిల్లు బిజినెస్‌లో బిజీగా మారిన షకీల్… మెల్లిగా రాజకీయాలకు దూరం అవుతున్నారా అన్నది కొందరి అనుమానం. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెనుక ఆసక్తి లేకపోవడమేనా..? లేక ఇతర బలమైన కారణాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనన్నది రాజకీయ వర్గాల మాట. కానీ అప్పటి వరకు క్యాడర్ తలోదిక్కు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ పెద్దలదే. బాస్…. జర దేఖో హమారా బోధన్ కో….. అంటున్న కార్యకర్తల మాటల్ని పార్టీ పెద్దలు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.