Reading Time: 2 minutes
Four Mighty Warriors Who Did Not Fight In The Mahabharata War And Why

Mahabharat Facts: మహాభారత యుద్ధం మానవ చరిత్రలోనే ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన అత్యంత భీకరమైన యుద్ధంగా నిలిచిపోయింది. కురుక్షేత్ర మైదానంలో 18 రోజుల పాటు సాగిన ఈ మహాసంగ్రామంలో మొత్తం 18 అక్షౌహిణుల (ప్రాచీన భారతదేశంలో చతురంగ బలాల అతిపెద్ద ప్రామాణిక కొలత) సైన్యం పాల్గొంది. ఇందులో కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం ఉంటే, పాండవుల వైపు కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. ఇక్కడ ఒక్కో అక్షౌహిణికి 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాలిబంట్లు ఉంటాయి. అప్పట్లో భరతఖండంలోని దాదాపు ఏ రాజు సైతం ఈ యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాడు, ఏదో ఒక పక్షాన నిలబడాల్సి వచ్చింది. అయితే, అపారమైన పరాక్రమం, శౌర్యం ఉండి కూడా కొందరు మహా యోధులు ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనలేదు. వీళ్లు తలుచుకుంటే యుద్ధం ఫలితాన్నే మర్చే సత్తా ఉంది. అలాంటి నలుగురు ప్రముఖ ధీరుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకృష్ణుని అన్నయ్య బలరాముడు..

శ్రీకృష్ణుని అన్నయ్య అయిన బలరాముడు యదువంశంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడు. మగధ రాజు జరాసంధుడు చేసిన అనేక దండయాత్రలను ఆయన ఒంటరిగానే తిప్పికొట్టారు. ఒకానొక సందర్భంలో కౌరవులు శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడిని బంధించినప్పుడు, బలరాముడు ఒంటరిగానే హస్తినాపురానికి వెళ్లారు. అక్కడ కౌరవులు ఆయనను అవమానించడంతో ఆగ్రహించి, తన ఆయుధమైన హలంతో (నాగలి) హస్తినాపురాన్ని గంగలో ముంచేందుకు లాగడం ప్రారంభించారు. దాంతో భయపడిపోయిన కౌరవులు వెంటనే సాంబుడిని విడిచిపెట్టారు. సాక్షాత్తు శేషనాగు అవతారంగా భావించే బలరాముడికి దుర్యోధనుడు అత్యంత ప్రియమైన శిష్యుడు. మరోవైపు శ్రీకృష్ణుడు పాండవుల వైపు (అర్జునుడికి) మద్దతుగా నిలిచాడు. ఇటు శిష్యుడు, అటు సోదరుడి నిర్ణయం మధ్య నలిగిన బలరాముడు.. ఏ పక్షానా నిలబడకుండా తటస్థంగా ఉండటమే ధర్మమని భావించి యుద్ధానికి దూరంగా ఉండిపోయారు. ఒకవేళ ఆయన కౌరవుల తరఫున యుద్ధం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో!

శ్రీకృష్ణుడి బావ అయిన రుక్మి..

రుక్మిణీ దేవి సోదరుడు, శ్రీకృష్ణుడి బావ అయిన రుక్మి కూడా అసాధారణ పరాక్రమవంతుడు. విదర్భ దేశపు రాజు భీష్మకుని కుమారుడైన ఈయన ‘విజయ్’ అనే అద్భుతమైన ధనస్సును ధరించేవాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకునేందుకు తీసుకువెళుతున్నప్పుడు, రుక్మి తన సైన్యంతో అడ్డుకోవడానికి వెంటాడాడు. శ్రీకృష్ణుడిని బంధించి తీసుకురాకపోతే తన రాజధాని కుండినపురానికి తిరిగి అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు. కానీ యుద్ధంలో శ్రీకృష్ణుని చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అతని గడ్డం, మీసాలు కత్తిరించి అవమానించాడు. దాంతో తన ప్రతిజ్ఞ ప్రకారం రుక్మి తిరిగి తన రాజ్యానికి వెళ్లలేకపోయాడు. ఆ అవమాన భారం, పగ కారణంగానే ఆయన మహాభారత యుద్ధంలో సైతం పాల్గొనకుండా దూరంగా ఉండిపోయాడు.

భీముడి మనుమడు బార్బరీకుడు..

భీముడి మనుమడు, ఘటోత్కచుడు-మోరవిల కుమారుడైన బార్బరీకుడు మహాభారతంలోనే అత్యంత శ్రేష్ఠుడైన విలుకాడు(విలువిద్యలో ఆరితేరిన వాడు). యుద్ధంలో ఎల్లప్పుడూ ఓడిపోయే పక్షం వైపే నిలబడతానని బార్బరీకుడు తన తల్లికి మాట ఇచ్చాడు. ఆయన కురుక్షేత్రం వైపు వస్తున్నాడనే వార్త శ్రీకృష్ణుడిని ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే యుద్ధంలో కౌరవుల ఓటమి ఖాయం, అప్పుడు బార్బరీకుడు తన ప్రతిజ్ఞ ప్రకారం కౌరవుల వైపు చేరి పాండవులను ముంచేస్తాడని కృష్ణుడు గ్రహించాడు. బార్బరీకుడి వద్ద కేవలం మూడు బాణాలు మాత్రమే ఉన్నప్పటికీ, క్షణాల వ్యవధిలో ఇరువైపుల సైన్యాన్ని అంతమొందించగల శక్తి వాటికి ఉంది. అందుకే శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వెళ్లి బార్బరీకుడిని దానంగా అతని తలని అడిగాడు. ఆ వీరుడు కూడా ఎలాంటి సంకోచం లేకుండా తన తలను దానం చేయడంతో యుద్ధంలో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. కానీ, యుద్ధాన్ని వీక్షించాలనే అతని చివరి కోరిక మేరకు శ్రీకృష్ణుడు అతని తలను ఒక కొండపై ఉంచగా, బార్బరీకుడు మొత్తం యుద్ధాన్ని వీక్షించాడు.

విదురుడు..

మహాభారత కాలంలో ధర్మానికి మారుపేరుగా నిలిచిన విదురుడు కూడా యుద్ధంలో ఆయుధం పట్టలేదు. కేవలం ఒక ప్రేక్షకుడిలా దూరంగా ఉండిపోయారు. రాజా ధృతరాష్ట్రునికి ముఖ్య సలహాదారుడిగా ఉన్న విదురుడిని ఒక సందర్భంలో దుర్యోధనుడు సభలో తీవ్రంగా అవమానించాడు. దాంతో మనస్తాపానికి గురైన ఆయన రాజసభతో పాటు యుద్ధానికి సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కౌరవులు నడుస్తున్నది అధర్మ మార్గమని, వారి వినాశనం ఖాయమని విదురుడికి ముందే తెలుసు. ఎల్లప్పుడూ సత్యం, ధర్మం వైపు నిలిచే వ్యక్తి కాబట్టి, అధర్మ పక్షాన పోరాడటం ఇష్టం లేక, అలాగని హస్తినాపుర అన్నం తిని దానికి ద్రోహం చేయలేక ఆయన పూర్తిగా తటస్థంగా ఉండిపోయారు.