
ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని 12 ఏళ్ల పాటు పాలించిన ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ రికార్డ్ను మోడీ అధిగమించారు. ఈ సందర్భంగా దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వస్తున్నాయి. ప్రధాని మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-ఇటలీ సంబంధాలను ఎక్స్ వేదికగా గుర్తుచేసుకున్నారు.
‘‘ఈరోజు భారత చరిత్రలో అత్యంత కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నరేంద్ర మోడీకి అభినందనలు” అని పేర్కొన్నారు. ఇటీవల రోమ్లో మోడీతో జరిగిన సమావేశాన్ని కూడా మెలోని గుర్తు చేసుకున్నారు. “కొన్ని వారాల క్రితం రోమ్లో మళ్లీ మోడీని కలవడం ఆనందంగా ఉంది. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలు సృష్టించేలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాం” అని మెలోని తెలిపారు.
జూన్ 10, 2026 నాటికి ప్రధాని మోడీ వరుసగా 4,399 రోజులు ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాలాన్ని అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ.. 2019లో రెండోసారి.. 2024లో మూడోసారి వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చారు.
ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం.. మోడీ-మెలోనీ సమావేశంలో 2025-2029 ఇండియా-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, పరిశోధన, అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు (AI), కీలక సాంకేతిక రంగాలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. అలాగే విదేశాంగ మంత్రుల స్థాయిలో ప్రత్యేక సమీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. 2029 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్తంగా డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కూడా స్వాగతించినట్లు పీఎంఓ తెలిపింది. అదనంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ప్రాజెక్టుపై కూడా కలిసి పనిచేయాలని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి.
భారత్-ఇటలీ సంబంధాలు 2023లో మెలోనీ భారత్ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యంగా ప్రారంభమయ్యాయి. అనంతరం 2024లో జీ20 సదస్సు సందర్భంగా 2025-2029 జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్కు రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ బంధాలను మరింత బలోపేతం చేస్తూ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడం ఇరు దేశాల సంబంధాల్లో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
Congratulazioni a @narendramodi che oggi diventa il Primo Ministro eletto più longevo nella storia dell’India.
È stato un piacere ritrovarci a Roma nelle scorse settimane e lanciare assieme un Partenariato Strategico Speciale che guarda al futuro per creare nuove opportunità… pic.twitter.com/hiQICM6eKV
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 10, 2026