
ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రి ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు, సహజ వాయువు ఆస్తులపై కూడా అమెరికా భవిష్యత్తులో నియంత్రణ సాధించవచ్చని పేర్కొనడం సంచలనంగా మారింది. దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత ప్రమాదకర దశలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ సామర్థ్యాలు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. “ఈ రాత్రి ఇరాన్పై అమెరికా చాలా తీవ్రంగా దాడి చేయబోతోంది” అని హెచ్చరించారు.
ఖర్గ్ దీవిపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం అయిన ఖర్గ్ దీవిపై కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఖర్గ్ దీవితో పాటు మరికొన్ని చమురు మౌలిక వసతులపై అమెరికా నియంత్రణ సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెనిజులాలో చేసినట్లే ఇరాన్ చమురు, గ్యాస్ మార్కెట్లపై కూడా పూర్తి నియంత్రణ సాధించవచ్చని వ్యాఖ్యానించారు. ఖర్గ్ దీవి ద్వారా ఇరాన్ చమురు ఎగుమతుల్లో అత్యధిక భాగం జరుగుతుండటంతో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
మళ్లీ ముదురుతున్న ఘర్షణలు
గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు-ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు ఏప్రిల్లో కాల్పుల విరమణతో కొంత తగ్గినప్పటికీ తాజాగా మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలపై మరోసారి దాడులు నిర్వహించారు. ఇరాన్ చర్చలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. “మేము ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాం. కానీ ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తోంది” అని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. అనంతరం ‘ఇరాన్ మమ్మల్ని మోసం చేస్తోంది. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సిందే.’’ అని హెచ్చరించారు.
కాల్పుల విరమణ అర్థం లేకుండా పోయింది: ఇరాన్
అమెరికా తాజా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అర్థరహితంగా మార్చేశాయని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. “అమెరికా తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం మాత్రమే కాదు.. కాల్పుల విరమణను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాయి” అని విమర్శించింది.
గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ దాడులు
ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు సమాచారం. జోర్డాన్ 20 ఇరానీ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. కువైట్ శత్రు వైమానిక లక్ష్యాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. బహ్రెయిన్లో ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని దాడుల సంకేతాలు
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు. ‘‘అవసరమైతే బాంబులతోనే చర్చలు జరుపుతాం.’’ అని పేర్కొన్నారు. అమెరికా వ్యూహంలో సైనిక ఒత్తిడి కీలకంగా కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. దీంతో పరిస్థితి దౌత్య చర్చల దిశగా కాకుండా మరింత పెద్ద సైనిక ఘర్షణ వైపు వెళ్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి
ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు పూర్తిగా ఆగిపోలేదు. ఖతార్ ప్రతినిధులు ఈ వారం టెహ్రాన్లో చర్చలు జరిపారు. అమెరికా-ఇరాన్ మధ్య మిగిలిన విభేదాలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ కూడా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ప్రకటించింది. రష్యా, చైనా, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నాయి.
హార్ముజ్ జలసంధిపై ఆందోళనలు
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ‘‘తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నాం.’’ అని ఇరాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఒమాన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా.. ఈ ఘటనపై అమెరికా దౌత్యవేత్తను పిలిపించి భారత్ నిరసన తెలిపింది.
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు, ఇరాన్ చమురు మౌలిక వసతులపై నియంత్రణ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యాన్ని మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
