
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, ఉచిత పథకాలు, కుల రాజకీయాలు, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు, తెలంగాణ రాజకీయాలు వంటి అంశాలపై ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ దేశాన్ని ఏకం చేసిన నాయకుడని పవన్ పేర్కొన్నారు. మోడీతో తనకు జరిగే ప్రతి చర్చ దేశ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతుందని చెప్పారు. ప్రాంతాలు, కులాలు, రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమనే భావనతో తాము పనిచేస్తున్నామని వెల్లడించారు.
ఉచిత పథకాలు మరియు ఫ్రీబీల మధ్య స్పష్టమైన తేడా ఉందని పవన్ కల్యా్ణ్ అన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు అవసరమేనని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం విచక్షణారహితంగా ఫ్రీబీలు ప్రకటించడం సరైన విధానం కాదన్నారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. కుల రాజకీయాలపై స్పందించిన పవన్.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం కారణంగా ఆ స్థాయికి చేరుకున్నారని ప్రశ్నించారు. కుల రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు.
నక్సలైట్ కావాలనే ఆలోచన తనలో ఉండేది..
తన యువకుడి దశలో నక్సలైట్ కావాలనే ఆలోచన తనలో ఉండేదని పవన్ వెల్లడించారు. అయితే తన అన్న చిరంజీవి తనను నిర్మాణాత్మక మార్గంలో నడిపించారని చెప్పారు. యువత ప్రాంతీయ విద్వేషాలు, విధ్వంసక రాజకీయాలకు దూరంగా ఉండాలని, వారు ప్రస్తుతం సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
అమిత్షా హామీ ఇచ్చాక వివాదం ఎందుకు?
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల్లో తర్కం ఉందని పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై అనవసర వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. ఉత్తర-దక్షిణ విభజన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. దేశ సమైక్యతను ప్రాంతాల పేరుతో దెబ్బతీయకూడదని ఆయన అన్నారు. ప్రధాని మోడీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇద్దరూ గుజరాత్కు చెందిన వారేనని గుర్తు చేస్తూ, ప్రాంతీయత కంటే జాతీయత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమన్నారు.
తెలంగాణ రాజకీయాలపై నా దృష్టి లేదు..
తెలంగాణ రాజకీయాలపై ప్రస్తుతం తన దృష్టి లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధేనని చెప్పారు. తెలంగాణలో జనసేనకు బలమైన క్యాడర్, నాయకత్వం ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు.
ఇది ఎవరి జాగీరు కాదు..
హైదరాబాద్లో తన పర్యటనలపై వస్తున్న విమర్శలకు కూడా పవన్ సమాధానం ఇచ్చారు. తన దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, హైదరాబాద్కు రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. “ఇది ఎవరి జాగీరు కాదు.. ఇది నా మాతృభూమి” అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని, తెలంగాణలోకి అడుగుపెట్టనివ్వమంటూ బెదిరింపులు కూడా వచ్చాయని పవన్ ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేష రాజకీయాలు పెరిగాయని అన్నారు. ఇక, గత 13 నెలలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన పవన్, తన ప్రాథమిక హక్కులను హరించే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. దేశ సమైక్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..