Reading Time: 3 minutes
Mamata Banerjee Tmc Congress Merger Speculation India Alliance Crisis

TMC Congress Merger: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం ఓ అంశం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “మమతా బెనర్జీ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? తన సొంత పార్టీ టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారా?” అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు అనడానికి ఢిల్లీ కారిడార్లలో మారుమోగుతున్న ఈ చర్చలే నిదర్శనం. బెంగాల్‌లో తన ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి, స్థానిక నేతలు ప్రజా చైతన్యానికి భయపడి పారిపోతుంటే.. దీదీ మాత్రం కోల్‌కతాలో ఉండకుండా ఢిల్లీలో విడతల వారీగా చర్చలు జరపడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

దీనికి గల కారణాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మమతా బెనర్జీ తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభలో 29 స్థానాలు, రాజ్యసభలో 12 స్థానాలతో విపక్షాల్లో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న టీఎంసీ.. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో సఖ్యతగా ఉండేది కాదు. చాలా కూటమి సమావేశాలకు మమత స్వయంగా వెళ్లకుండా అభిషేక్ లేదా డెరెక్ ఒబ్రెయిన్‌లను పంపేవారు. కానీ, బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై, పార్టీ ముక్కలయ్యే ప్రమాదంలో పడ్డాక ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం సోనియా గాంధీతో మమత వన్-టు-వన్ భేటీ కాగా, బుధవారం రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. మళ్లీ అదే రోజు మమత, సోనియాను కలవడం వెనుక “టీఎంసీ భవిష్యత్తు, కూటమి రాజకీయం” దాగి ఉందనేది స్పష్టమవుతోంది.

గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీ సామ్రాజ్యం మే 4 నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అవినీతి, దౌర్జన్యాలతో కూడిన పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో 294 సీట్లున్న అసెంబ్లీలో టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఈ ఓటమి తెచ్చిన నిరాశతో పార్టీలో తిరుగుబాటు వెల్లువలా మారింది. 100 మందికి పైగా కౌన్సిలర్లు రాజీనామా చేయగా, రితబ్రతా బెనర్జీ నేతృత్వంలో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు మమతకు వ్యతిరేకంగా విపక్ష నేతగా చేరారు. అటు లోక్‌సభలోనూ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. కేవలం నెల రోజుల్లోనే పార్టీపై పట్టు కోల్పోయిన మమత, కలకత్తా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. గతంలో శివసేన, ఎన్సీపీ కేసుల అనుభవాల దృష్ట్యా తిరుగుబాటు వర్గానికి ఉన్న సంఖ్యాబలం ముందు ఫిరాయింపుల నిరోధక చట్టం తనను కాపాడలేదని ఆమెకు తెలుసు.

అయితే, ఈ విలీన వార్తలపై తిరుగుబాటు గ్రూప్ లీడర్ రితబ్రతా బెనర్జీ గట్టిగా స్పందించారు. రెబెల్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 64 కి చేరిందని చెప్తూ.. తమ వైపు ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనాన్ని అంగీకరించబోరని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇక విలీనం ఎవరి కోసం అని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, తిరుగుబాటుదారులు తన ప్రాణసమానమైన పార్టీ గుర్తును, పేరును లాక్కోకుండా చూసుకోవడానికి మమతకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్‌లో విలీనం మాత్రమేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఆమె జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆకాంక్ష నెరవేరడమే కాకుండా, ప్రస్తుతం ఒంటరైపోయిన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తుకు సైతం ఒక రక్షణ దొరుకుతుంది.

ఈ విలీన ప్రతిపాదనను పలువురు అగ్రనేతలు, విశ్లేషకులు సమర్థిస్తున్నారు. జూన్ 5న శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ నుంచి చీలిపోయిన టీఎంసీ, ఎన్సీపీ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ మళ్లీ మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లో విలీనం కావడం ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు చావ్లా ఎక్స్‌ (X) లో స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టీఎంసీని కాపాడే ఆపరేషన్ ఏమైనా మొదలుపెట్టిందా? లేకపోతే సోనియా గాంధీ నిమిషాల వ్యవధిలో మమతను, అభిషేక్‌ను విడివిడిగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ సబా నఖ్వీ, ఐటీ టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ లు కూడా.. బలహీనమైన కూటముల కంటే కాంగ్రెస్ గర్భం నుంచి పుట్టిన ఈ పార్టీలన్నీ మళ్లీ ఏకమై ఒకే తాటిపైకి వస్తే ప్రతిపక్షం బలోపేతం అవుతుందని, అది అటు కాంగ్రెస్‌కు, ఇటు సంక్షోభంలో ఉన్న టీఎంసీకి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ది హిందూ పత్రిక కథనం ప్రకారం.. ఈ భేటీలు కేవలం 2029 సార్వత్రిక ఎన్నికల వ్యూహాల కోసమేనని కొందరు అంటున్నప్పటికీ, అంతర్గతంగా ఏదో పెద్ద వ్యూహమే నడుస్తోందని స్పష్టమవుతోంది. సోనియా గాంధీకి, మమతా బెనర్జీకి మధ్య ఉన్న పాత అనుబంధం ఇందుకు ఒక సానుకూల అంశం. నాడు రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్‌లో నమ్మకమైన కమాండర్‌గా ఉన్న మమత.. 1997లో బెంగాల్ కాంగ్రెస్ నేతలతో విభేదాల కారణంగా బయటకు వచ్చి 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి, 2011లో లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాలచక్రం మళ్లీ మొదటికి వచ్చిందా? బెంగాల్‌లో కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసిన టీఎంసీ.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి మాతృసంస్థ శరణు వేడుతోందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. నిఖార్సైన వీధిపోరాట యోధురాలైన మమతా బెనర్జీ అంత తేలికగా లొంగిపోరని తెలిసినప్పటికీ, ప్రస్తుతం ఆమె ఇరుక్కున్న ఈ ‘క్యాచ్-22’ (ధర్మసంకటం) పరిస్థితిలో విలీనమే ఆఖరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.