
Explained: రాజకీయాల్లో ఒక సామెత ఉంది. నాయకుడికి పార్టీ దూరం కావచ్చు, కానీ ప్రజలు దూరం కానంతవరకు ఆ నాయకుడికి తిరుగుండదు! ఒకప్పుడు ఇందిరా గాంధీ విషయంలో నిజమైన ఈ మాట. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ విషయంలో కూడా నిజం కాబోతోందా? మూడు దశాబ్దాల క్రితం తనే ప్రాణం పోసి, పెంచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మమత చేజారి పోతోంది. అయినా.. దీదీ నాడు ఇందిరా గాంధీ మాదిరిగా తట్టుకుని నిలబడతారా? నాటి ఇందిర చరిత్రం.. నేడు బెంగాల్ చదరంగంలో ఎలా పునరావృతమవుతోందో తెలుసుకుందాం..
1969లో ఏం జరిగింది?
“బాధ అనేది ఒక సుడిగుండంలా చుట్టుముడుతుంది. చాపలా దాన్ని చుట్టేసి పక్కన పెట్టలేం.” 1977 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, తన సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ ఇందిరా గాంధీ చెప్పిన మాట ఇది. ఆమె బయోగ్రాఫర్ పుపుల్ జయకర్ ఈ విషయాన్ని తన పుస్తకంలో ప్రస్తావించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో.. నిన్నటివరకు ఇందిరను దైవంగా పూజించిన కాంగ్రెస్ పార్టీనే ఆమెను వదిలించుకోవాలని చూసింది. అత్యంత సన్నిహితులు సైతం దూరమయ్యారు. ఇక ఇందిర రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని ప్రత్యర్థులు పండగ చేసుకున్నారు. కానీ, ఇలాంటి మాటలే ఎనిమిదేళ్ల క్రితం, అంటే 1969లోనూ వినిపించాయి. రాజకీయాల్లో కొందరు నాయకులు చరిత్రను సృష్టిస్తే, ఆ చరిత్రే వారిని మళ్లీ మళ్లీ గెలిపిస్తుంది. ఇందిరా గాంధీ జీవితం సరిగ్గా ఇలాంటిదే. ఆమె రెండుసార్లు పార్టీపై నియంత్రణ కోల్పోయారు, రెండుసార్లు సొంత పార్టీల నుంచే బహిష్కరణకు గురయ్యారు. కానీ, ప్రతిసారీ సరికొత్త వ్యూహాలతో, సరికొత్త కాంగ్రెస్ రూపాలతో అంతకంటే బలమైన ప్రజానేతగా తిరిగి వచ్చారు.
నేడు మమత పరిస్థితి అదే..
ఇప్పుడు, సరిగ్గా ఇన్నేళ్ల తర్వాత 2026లో అలాంటి ఓ ఘటన పునరావృతమైంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఇందిర లాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం తనే స్వయంగా ప్రాణం పోసి పెంచిన పార్టీపై మమత నియంత్రణ కోల్పోతున్నారు. ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ను తమ ఆధీనంలోకి తీసుకుని, రియల్ తృణమూల్ పేరుతో దూసుకుపోతోంది. పార్లమెంట్లోనూ ఆమె నమ్మకస్తులైన ఎంపీలు తిరుగుబాటు గ్రూపులో చేరిపోయారు. అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఏదో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని మమత మాజీ అనుచరురాలు, ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు, మమత తన తృణమూల్ కాంగ్రెస్ను ప్రధాన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం సైతం కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం సుదీర్ఘ చర్చల తర్వాత ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, మమతా బెనర్జీ తన పార్టీ పేరును, గుర్తును సైతం కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, చరిత్రలోని పోలికలకు కొన్ని పరిమితులు ఉంటాయి. నాటి కాంగ్రెస్ పార్టీకి, నేటి తృణమూల్కు చాలా తేడా ఉంది. ఇందిర, మమతల వ్యక్తిత్వాలు, వారు రాజకీయం చేసిన కాలాలు, పరిస్థితులు సైతం విభిన్నమైనవే. అయినప్పటికీ, ఒక ప్రజాకర్షణ గల నాయకురాలు తన సొంత పార్టీపైనే పట్టు కోల్పోవడం అనే దృశ్యం మాత్రం భారత రాజకీయాల్లో గతంలో చూసిన సినిమానే మళ్లీ గుర్తుకు తెస్తోంది. నాటి ఇందిర కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే.. వ్యవస్థ కంటే, పార్టీ నిర్మాణం కంటే ప్రజాదరణే అత్యంత శక్తివంతమైనది. తొలిసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం చెందినప్పుడు, మొరార్జీ దేశాయ్ లాంటి సీనియర్ను పక్కనబెట్టి ఇందిరా గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది నాటి కాంగ్రెస్ పెద్దల కూటమి సిండికేట్. కె. కామరాజ్, ఎస్. నిజలింగప్ప, అతుల్య ఘోష్, ఎస్.కె. పాటిల్, బిజు పట్నాయక్ వంటి ప్రాంతీయ దిగ్గజాలతో కూడిన ఈ సిండికేట్.. ఇందిరను తమకు నచ్చినట్లు తిప్పుకోవచ్చని భావించింది. కానీ, నెహ్రూ కూతురు అంత లొంగిపోయే మనిషి కాదని వారికి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
1969 నాటికి ఈ ఆధిపత్య పోరు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వీధికెక్కింది. సిండికేట్ అధికారికంగా నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే, ఇందిర మాత్రం స్వతంత్ర అభ్యర్థి వి.వి. గిరికి మద్దతుగా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. చివరికి వి.వి. గిరి గెలిచారు. ఈ దెబ్బతో షాకైన కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప.. క్రమశిక్షణా రాహిత్యం కింద ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. అలా కాంగ్రెస్ పార్టీ.. సిండికేట్ నేతృత్వంలోని కాంగ్రెస్ (O), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (R)గా చీలిపోయింది. పార్టీని ముక్కలు చేసిన పెద్దలకు ఇందిర భయపడలేదు. కేవలం కొద్దిమంది వ్యక్తులు కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకురాలిపై చర్యలు తీసుకోవడం హాస్యాస్పదమని తిప్పికొట్టారు. పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయినా సీపీఐ, డీఎంకే వంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వం పడిపోకుండా చూసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా, ఆమె అప్పటికే 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదల పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు. 1971 ఎన్నికలను ఆమె పూర్తిగా తన వ్యక్తిగత ప్రజాకర్షణ చుట్టూ తిప్పారు. విపక్షాల ఇందిరా హటావో నినాదానికి ప్రతిగా ఆమె “గరీబీ హటావో” (పేదరికాన్ని నిర్మూలించండి) అంటూ జనంలోకి వెళ్లారు. ఫలితం.. ఇందిర భారీ విజయం సాధించగా, సిండికేట్ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది.
మమత ఇందిర గాంధీలా నిలబడతారా?
కానీ, 1977లో ఎదురైన రెండో బహిష్కరణ అంతకంటే ప్రమాదకరమైనది. ఎమర్జెన్సీ చీకటి రోజులు ఇందిర ఇమేజ్ను దారుణంగా దెబ్బతీశాయి. జనతా పార్టీ ప్రభంజనంలో ఆమె ఘోరంగా ఓడిపోయారు. అధికారం పోగానే కాంగ్రెస్ నేతలు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో ఇందిరను ఒంటరిని చేశారు. ఆమెను కనీసం సామూహిక నాయకత్వంలో భాగస్వామిగా సైతం పరిగణించలేదు. కానీ, ప్రజలతో ఉన్న బంధాన్ని ఇందిర తెంచుకోలేదు. కొంతకాలం మౌనంగా ఉన్నా, ఆమె బీహార్లోని బెల్చి గ్రామంలో దళితులపై జరిగిన అరాచకాలను పరామర్శించడానికి వరదల్లో ఏనుగుపై ప్రయాణించి వెళ్లిన తీరు దేశాన్ని కదిలించింది. పార్టీ నేతలు సహకరించకపోయినా, జనం ఆమె కోసం వేలాదిగా తరలివచ్చారు. ఇందిర లేనిదే కాంగ్రెస్కు మనుగడ లేదని ప్రణబ్ ముఖర్జీ లాంటి లాయలిస్టులు గట్టిగా వాదించారు. చివరకు 1978 జనవరి 1, 2 తేదీల్లో ఢిల్లీలో భారీ కన్వెన్షన్ పెట్టి, ఇందిరను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె మద్దతుదారులు ప్రకటించుకున్నారు. దీనికి ప్రతిగా బ్రహ్మానంద రెడ్డి వర్గం ఆమెను మళ్లీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేవలం 54 మంది ఎంపీలతో ఇందిర కాంగ్రెస్ (I) ను స్థాపించారు. అదొక పెద్ద జూదం. కానీ, ఇందిర ప్రజాకర్షణ ముందు ఆ జూదం పారింది. కేవలం రెండేళ్లలో అంటే 1980లో ఇందిరా గాంధీ మళ్లీ ప్రధానిగా అఖండ విజయంతో తిరిగొచ్చారు. ప్రత్యర్థులు కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రకారుడు రాజ్మోహన్ గాంధీ అన్నట్లు.. ఎంతటి ప్రతికూల సమూహాన్నైనా ఒంటరిగా ఎదుర్కొని నిలబడగలిగిన ఇందిర 1980 పునరాగమనం భారత రాజకీయాల్లో ఒక అద్భుతం. ఇందిర జీవితం నిరూపించిన సత్యం ఒక్కటే.. నాయకుడికి సొంత పార్టీ దూరం కావచ్చు, కానీ ప్రజలు దూరం కానంతవరకు ఆ నాయకుడికి తిరుగుండదు. మరి ఇందిర తరహాలోనే, ప్రస్తుత సంక్షోభం నుంచి మమతా బెనర్జీ సైతం ప్రజాబలంతో పునర్జన్మ పొందుతారా? లేదా కాలప్రవాహంలో కొట్టుకుపోతారా అనేది కాలమే నిర్ణయించాలి.