Reading Time: < 1 minute

రూ.1.70 లక్షలకు శిశువు విక్రయం..హైదరాబాద్ కుల్సుంపురా పీఎస్ పరిధిలో ఘటన

Caption of Image.

ఓల్డ్‌‌సిటీ, వెలుగు: 12 రోజుల వయస్సు ఉన్న మగ శిశువును అక్రమంగా విక్రయించిన ఘటన కుల్సుంపురా పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో వెలుగుచూసింది. సుమారు 18 ఏళ్లుగా సంతానం లేని మధుసూదన్, మీనా దంపతులు బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారు. జియాగూడ పుకట్‌‌నగర్‌‌కు చెందిన పోతరాజు సురేశ్​ను సంప్రదించగా, అతడు పద్మ పల్తియా అనే మహిళతో కలిసి మధ్యవర్తిత్వం చేశాడు. 

మే 28న తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్, సంధ్య దంపతులకు జన్మించిన మగ శిశువును అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా సమీపంలో సురేశ్​సమక్షంలో మధుసూదన్, మీనా దంపతులు రూ.1.70 లక్షలు చెల్లించి శిశువును తీసుకున్నారు. 

దత్తతకు సంబంధించిన నిబంధనలు పాటించకుండా ఈ లావాదేవీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. శిశువు శారీరక వైకల్యంతో జన్మించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువును అమీర్‌‌పేటలోని శిశు విహార్‌‌కు తరలించారు.
 

©️ VIL Media Pvt Ltd.