
హైదరాబాద్ ఐటీ హబ్ నడిబొడ్డున ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. సైబర్టవర్స్కు అత్యంత చేరువలో ఉన్న ఖానామెట్ గ్రామంలో.. సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ.. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని సర్వే నంబర్లు 41/12, 13, 14 పరిధిలోని ఈ భారీ స్థలం చుట్టూ అధికారులు క్షేత్రస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
నిజానికి ఈ విలువైన ప్రభుత్వ భూమిపై గతంలో ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేసింది. దీంతో 2016లోనే ఆ భూములను ఖాళీ చేయాలంటూ TGIC (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ ప్రైవేట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.దీంతో గత దశాబ్దకాలంగా ఈ భూవివాదం కోర్టులో కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఇటీవల ఈ కేసును విచారించిన హైకోర్టు, ప్రైవేట్ సంస్థ క్లెయిమ్ను కొట్టేస్తూ కీలక తీర్పునిచ్చింది. ఈ విలువైన ప్రభుత్వ భూములను తక్షణమే రక్షించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
►ALSO READ | బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ: సీఎం రేవంత్ రెడ్డి
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు హైడ్రాను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది.. శరవేగంగా చర్యలు చేపట్టి, ఆ 15 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడమే కాకుండా.. అది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కబ్జాల గుప్పిట్లో చిక్కుకుపోతుందనుకున్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని.. హైకోర్టు తీర్పు , హైడ్రాతో ప్రభుత్వం విజయవంతంగా కాపాడుకోగలిగింది.