Reading Time: < 1 minute
Charu Pandey Clears 19 Government Exams President Gold Medal

కష్టపడి చదివితే అసాధ్యం అనేది ఏదీ ఉండదని మరోసారి నిరూపించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏళ్ల చారు పాండే. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఈ యువతి ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె సాధించిన ఈ అరుదైన ఘనతకు గాను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకోనుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాకు చెందిన తిల్దా-నియోరా ప్రాంతంలో చారు పాండే విద్యాభ్యాసం పూర్తిచేసింది. అనంతరం హేమ్‌చంద్ యాదవ్ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆమె పోటీ పరీక్షల కోసం సిద్ధమవడం ప్రారంభించింది. క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక, నిరంతర సాధన, సమయపాలన ఆమెను విజయపథంలో నడిపించాయి.

ప్రస్తుతం చారు పాండే చెన్నైలోని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఆమె ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, ఎమ్‌టీఎస్, జీడీ, సీపీఓ వంటి పరీక్షలతో పాటు ఐబీపీఎస్ పీఓ, క్లర్క్, ఎస్‌బీఐ పీఓ, క్లర్క్ పరీక్షల్లోనూ విజయం సాధించింది. అలాగే రైల్వే నియామక పరీక్షలు, ఢిల్లీ పోలీస్, ఛత్తీస్‌గఢ్ సబ్‌ఇన్‌స్పెక్టర్, ట్రాన్స్‌పోర్ట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో కూడా అర్హత సాధించింది.

అయితే ఈ విజయం ఆమెకు సులభంగా రాలేదు. ప్రారంభంలో పలు పరీక్షల్లో విఫలమైనప్పటికీ నిరుత్సాహపడకుండా తన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంది. ప్రతి పరీక్ష అనంతరం చేసిన తప్పులను విశ్లేషించి మరింత మెరుగైన ప్రణాళికతో ముందుకు సాగింది. స్పష్టమైన లక్ష్యాలు, క్రమబద్ధమైన చదువు, తరచూ మాక్ టెస్టులు రాయడం.. స్వీయ విశ్లేషణ చేసుకోవడం విజయానికి కీలకమని చారు చెబుతోంది. ఆమె కథ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.