తెలుగు రాష్ట్రాల్లో ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య .. ఏపీ, తెలంగాణలో పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. నైరుతి రుతుపవనాలు (జూన్ 11) ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీరప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.
వీటి ప్రభావంతో శుక్రవారం పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజులలో పెద్దగా మార్పు ఉండదని సూచించింది.
గురువారం సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరు జిల్లా వంగిపురంలో 27.5మిమీ, చిత్తూరు జిల్లా గంగవరంలో 23.5, పలమనేరులో 23.2, మార్కాపురం జిల్లా గొట్లగట్టులో 15.7 మిమీ వర్షపాతం రికార్డైందన్నారు. గడిచిన 24 గంటల్లో (10.06.2026 ఉదయం 8.30 గంటల నుండి 11.06.2026 ఉదయం 8.30 గంటల వరకు) రాష్ట్ర సగటు వర్షపాతం 8.8మిమీ నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 57.1 మి.మీ. వర్షపాతం, ఏలూరు జిల్లాలో 37 మి.మీ., బాపట్ల జిల్లాలో 34.9 మి.మీ., కృష్ణా జిల్లాలో 32.4 మి.మీ., గుంటూరు జిల్లాలో 30.3 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.




