
- ఆ దేశ పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడతం: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి సహకరించేందుకు సిద్ధమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ‘ఫార్మా హబ్’కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమైంది.
ఈ సందర్భంగా ‘తెలంగాణ – ఘనా’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు. ఘనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24- అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్పోర్ట్ డెవలెప్మెంట్ ప్రోగ్రాం, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టస్ ఒబువాడుం టానో వివరించారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనకు సహకరించాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు.
అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలోనే పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ’లను ఆయన వివరించారు. ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, వ్యాక్సిన్ల తయారీ, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణ, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకున్న అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఘనా ప్రతినిధులకు చెప్పారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని భరోసానిచ్చారు.