Reading Time: < 1 minute
Owaisi Slams Voter List Mapping Says Large Families Cant Lose Voting Rights979756

Asaduddin Owaisi:  ఓటర్ల జాబితా అప్‌డేట్ ప్రక్రియపై ఎంఐంఎ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో పిల్లల సంఖ్య ఆధారంగా ఓటర్లను గుర్తించే విధానాన్ని విమర్శించారు. భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఓటు హక్కును నిరాకరించే చట్టం లేదని స్పష్టం చేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారి కుటుంబాలను మ్యాపింగ్ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఓటర్ల జాబితా మ్యాపింగ్ సమయంలో ఐదుగురుకి పైగా పిల్లలు ఉన్న కుటుంబాల వివరాలు మ్యాపింగ్ చేయడం లేదని చెబుతున్నారు. నాకే ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆరుగురు పిల్లలు ఉన్నవారు ఓటు వేయకూడదని ఏ చట్టంలో లేదు. ప్రధాని మోడీకి ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షాది కూడా పెద్ద కుటుంబమే. సీఎం యోగి కుటుంబంలో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు’’ అని ఓవైసీ అన్నారు. ప్రతీ భారతీయ పైరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ఓవైసీ గుర్తు చేశారు.

ఓటర్ల జాబితా అప్‌డేట్‌లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు ఆయన తెలిపారు. 2002, 2024 ఓటర్ల జాబితాను సరిచూస్తున్నారని, ఈ ప్రక్రియలో అనేక వ్యత్యాసాలు బయపడుతున్నాయని అన్నారు. ఒక వ్యక్తి, ఆయన తండ్రి మధ్య వయసు తేడా 15 ఏళ్లు ఉంటే ఎన్నికల సంఘం దానిని ఒక లోపంగా పరిగణిస్తోందని, తాత-మనవళ్ల మధ్య వయసు వ్యత్యాసాల విషయంలో కూడా ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

జూన్ 25 నుంచి జనాభా గణన పత్రాల పంపిణీ జరుగుతుందని, వీటిని ఇంట్లో ఉంచుకోకుండా, వెంటనే నింపి అధికారులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ పత్రాలను సమర్పించకపోతే, మీ పేరు ముసాయిదా జాబితాలో కనిపించదని, మీ చిరునామా మారితే ఫారం 8, మీ పేరు జాబితాలో లేకపోతే ఫారం 6 నింపి, పత్రాలపై సంతకాలు చేసి, బీఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. ఇది కేవలం ఓటు హక్కు కోల్పోవడం గురించి మాత్రమే కాదని, మీ పౌరసత్వం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఓటర్ జాబితాల నుంచి పేదలు, దళితులు, ముస్లింల పేర్లు తొలగించి వారికి దేశ పౌరసత్వం లేనివారిగా మార్చాలని దేశంలో కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.