
Supreme Court: సుప్రీంకోర్టు గృహిణుల (హోమ్మేకర్స్) శ్రమకు, సమాజానికి వారు చేస్తున్న సేవలకు అపారమైన గౌరవాన్ని ఇస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గృహిణులను ‘నేషన్ బిల్డర్స్’ (జాతి నిర్మాతలు) గా అభివర్ణించింది. ఇల్లు, కుటుంబ సంరక్షణలో మహిళలు చేసే పనులకు ఎంతో ఆర్థిక విలువ ఉందని, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సేవల విలువను గుర్తిస్తూ ఒక గృహిణి ఊహాజనిత నెలవారీ ఆదాయాన్ని (నోషనల్ ఇన్కమ్) రూ. 30,000గా నిర్ధారించింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ప్రతిఫలం ఆశించకుండా గృహిణులు ఇంట్లో చేసే పనుల వెనుక ఉన్న ఆర్థిక ప్రాముఖ్యతను కోర్టు నొక్కి చెప్పింది. “ఇంటి మహిళలు కుటుంబం కోసం ఎంతో సహకారాన్ని అందిస్తారు. వారు నిజమైన జాతి నిర్మాతలు. దేశాన్ని నిర్మించడంలో వారి పాత్ర కీలకమైంది. మరి అలాంటప్పుడు వారి సేవలను కేవలం డబ్బుతో ఎలా కొలుస్తారు? అందుకే ఇకపై ‘హోమ్మేకర్’ అనే పదానికి ‘నేషన్ బిల్డర్’ అనే గుర్తింపు కూడా లభిస్తుంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా నష్టపరిహారాన్ని లెక్కించాల్సి వచ్చినప్పుడు గృహిణుల గృహ సంరక్షణ సేవల నష్టాన్ని ఒక ప్రత్యేక అంశంగా పరిగణించాలని, దానికి అనుగుణంగా వారి నెలవారీ ఆదాయాన్ని రూ. 30,000గా ప్రాతిపదికగా తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయమై గతంలోనూ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేసిన ధర్మాసనం.. దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆకాంక్షించింది. దీనివల్ల గృహిణుల అపారమైన కృషికి తగిన చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. మహిళలు ఇళ్లలో చేసే శ్రమ, కుటుంబం కోసం కేటాయించే సమయం సమాజానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. కాబట్టి, భవిష్యత్తులో వారికి సంబంధించిన నష్టపరిహారాల లెక్కింపులో ఈ సహకారాన్ని విడిగా గుర్తించి గౌరవించాలని కోర్టు తేల్చి చెప్పింది.