Reading Time: 1 minute
Fifa World Cup 2026 Begins 48 Teams Messi Ronaldo And A Big Miss For India

FIFA World Cup 2026 Begins: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మహా సమరం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మన దేశ జట్టు ఈ టోర్నీలో లేకపోయినా, భారత ఆటగాళ్లు బరిలో లేకపోయినా.. ఫుట్‌బాల్ అందించే ఉత్కంఠ, ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంటుంది. స్టార్ ఆటగాళ్ల అద్భుత నైపుణ్యం, మెరుపు వేగంతో సాగే మ్యాచ్‌లు, అద్భుత గోల్స్ అభిమానులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి.

గురువారం (జూన్ 11) నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో, నేమార్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులు కూడా తమ ప్రతిభను చాటుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. ఈసారి ప్రపంచకప్ అనేక కొత్త రికార్డులకు వేదిక కానుంది. చరిత్రలో తొలిసారిగా 48 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గత ఎడిషన్‌లో 32 జట్లు మాత్రమే పోటీపడగా.. ఇప్పుడు జట్ల సంఖ్య పెరగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

టోర్నీకి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు మొత్తం 39 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌లు 16 నగరాల్లో నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూపులుగా విభజించి లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రస్తుత టోర్నీలో అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్ విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో అర్జెంటీనా సిద్ధమవుతోంది. అయితే ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు కూడా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈసారి ప్రపంచకప్‌లో పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లకు భారీ స్థాయిలో ప్రైజ్‌మనీ ప్రకటించారు. ఛాంపియన్ జట్టుకు రూ. 476 కోట్లు.. రన్నరప్ జట్టుకు రూ. 314 కోట్లు అందనున్నాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 276 కోట్లు ప్రైజ్‌మనీ దక్కుతుంది. భారీ బహుమతి మొత్తం, ప్రపంచ స్థాయి పోటీ, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనతో ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ అభిమానులకు మరపురాని క్రీడా విందుగా మారనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టి ఇప్పుడు ఈ మహా టోర్నీపైనే నిలిచింది. అయితే భారత్ లేకపోవడం మనకు కాస్త నిరాశే అని చెప్పాలి.