Reading Time: < 1 minute
Vaibhav Suryavanshi Father Sacrifice Cricket Journey Ipl 2026

భారత క్రికెట్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలవడమే కాకుండా, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు బాది విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లకు వైభవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఒకవేళ అతడు ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటే, 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, భారత్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్గా వైభవ్ చరిత్ర సృష్టిస్తాడు.

తండ్రి త్యాగం – పూర్వీకుల భూమి అమ్మకం..
వైభవ్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ చేసిన అపురూప త్యాగం ఉంది. బిహార్‌లోని సమస్తీపూర్ గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకుల భూమి ఉంది. అది దానిని ఒక ఆస్తిలా కాకుండా.. ఒక సెంటిమెంట్ గా భావించేవారు. వైభవ్ 4 ఏళ్ల వయసులోనే ప్లాస్టిక్ బంతితో అద్భుతంగా టైమింగ్ చేయడాన్ని గమనించిన సంజీవ్, కొడుకు కల కోసం ఆ భూమిని అమ్మేశారు. సమస్తీపూర్ నుండి పాట్నాలోని అకాడమీకి ఉన్న 90 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఆ డబ్బుతో ఒక కారు కొని, కొడుకును స్వయంగా ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేవారు.

“భూమి అమ్మినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. వైభవ్ సాధిస్తున్న విజయం అన్నిటికంటే గొప్పది. దేశం తరఫున ఆడాలనే మా కల నిజమైంది. ఇప్పుడు డబ్బు, ఆస్తి కంటే మా అబ్బాయికి లభిస్తున్న గౌరవమే మాకు ముఖ్యం.” అని తండ్రి సంజీవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఐపీఎల్, అండర్-19 వరల్డ్ కప్, ఇండియా-ఎ పర్యటనల తర్వాత, ఇప్పుడు వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ట్రై సిరీస్ ఆడుతున్న వైభవ్‌.. త్వరలోనే అతడు టీమిండియా జెర్సీలో మైదానంలోకి దిగి సరికొత్త చరిత్ర లిఖించనున్నాడు.