
గృహిణుల వేతనంలేని శ్రమపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణి కేవలం హోంమేకర్ మాత్రమే కాదు.. నేషన్ బిల్డర్ కూడా.. కుటుంబ బాధ్యతలో భర్త బాధ్యత ఎంతుంటుందో భార్యగా గృహిణి బాధ్యత అంతే ఉంటుంది. ఆమె చేసే ఇంటిపని, పిల్లల సంరక్షణకు ఆర్థిక విలువ ఉంది.. కుటుంబ బాధ్యతల్లో గృహిణి పాత్రను గుర్తించాల్సిందే అని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదం నష్టపరిహారం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రోడ్డు ప్రమాదాల కేసుల్లో నష్టపరిహారం విధానాన్ని ప్రభావితం చేసే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. గృహిణులు ఇంట్లో చేసే వేతనం లేని పనికి కనీసం నెలకు రూ.30 వేల ఆర్థిక విలువ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రమాదంలో గృహిణి మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే కుటుంబం కోల్పోయే గృహ సంరక్షణ సేవలకు ప్రత్యేకంగా నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొంది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును మోటారు ప్రమాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పును వెలువరించంది. గృహిణులు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని కోర్టు అభిప్రాయపడింది.
►ALSO READ | వందే భారత్ రైలు 9 గంటలు ఆలస్యమా.?.. నిజంగా ఆశ్చర్యంగా ఉందే..
తీర్పు సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్ మాట్లాడుతూ..“గృహిణియే దేశాన్ని నిర్మిస్తుంది. ఆమె కృషి దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుంది” అని వ్యాఖ్యానించారు. అందుకే ఆమె ‘హోమ్ మేకర్ మాత్రమే కాదు.. ‘నేషన్ బిల్డర్’ అని వ్యాఖ్యానించింది.
ఇప్పటి వరకు మోటారు ప్రమాద కేసుల్లో నష్టపరిహారానికే పరిమితమైన విధానాన్ని విస్తరించి, ఇకపై “గృహ సంరక్షణ నష్టం” అనే ప్రత్యేక శీర్షిక కింద కూడా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏంటీ కేసు..
పంజాబ్కు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిహారం కోరుతూ ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ను ఆశ్రయించగా ఆమె కుటుంబానికి రూ.2.42లక్షల పరిహారం ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం గురువారం (జూన్ 11) ఈ కేసును విచారించింది సుప్రీంకోర్టు.