Reading Time: < 1 minute
Tata Motors To Increase Car Prices From July 1 2026 Across All Models

Tata Motors: దేశంలోనే రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ‘టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్’ (TMPV) వాహన ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం కేవలం ఒక్క సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా.. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) ఇలా అన్ని రకాల మోడళ్లపై పడనుంది. తమ కార్ల ధరలను గరిష్టంగా 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కార్ల తయారీకి అయ్యే ఇన్‌పుట్ ఖర్చులు (ముడిసరుకు ధరలు) విపరీతంగా పెరిగిపోవడం, మార్కెట్లో ఉన్న ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. పెరిగిన ఖర్చుల భారాన్ని చాలా వరకు కంపెనీయే భరిస్తున్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో కొంత భాగాన్ని మాత్రమే ధరల పెంపు రూపంలో కస్టమర్లపై వేయాల్సి వస్తోందని కంపెనీ వివరించింది. అయితే, ఏ కారు ధర ఎంత పెరుగుతుందనే ఖచ్చితమైన వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు విడివిడిగా ఉంటుందని పేర్కొంది. ఒకవేళ మీరు టాటా కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే.. జూన్ 30 లోపు కొనుగోలు చేయడం ద్వారా ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చు.

టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ (EV), ఐసీఈ (ICE – ఇంటర్నల్ కంబస్చన్ ఇంజిన్) రెండు విభాగాల్లోనూ ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. దీని ప్రకారం.. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి విభాగాల్లో ఉన్న టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, సియెర్రా, హారియర్, సఫారీ కార్లను కొనాలంటే ఇకపై ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో ఉన్న టాటా టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి. కార్లు కొనాలనుకునే వారికి ఇది నిజంగా కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, జూన్ నెలాఖరు వరకు పాత ధరలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.