
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా దామినీడు వేదికగా శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రప్పారప్పా అంటే తాము చూస్తూ ఊరుకోమని, రెడ్బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని ప్రతిపక్షంకు వార్నింగ్ ఇచ్చారు.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ‘ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్న’ అని పేర్కొన్నారు. తనకు సొంత అన్న లేని లోటును పవన్ అన్న తీర్చారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ‘ఇప్పుడు ఏపీలో భూతులు లేవు, జేసీబీలు లేవు. అక్రమాలు, దౌర్జన్యాలు కనిపించడం లేదు. ప్రజలకు రెండేళ్లుగా స్వాతంత్ర్యం లభించింది’ అని పేర్కొన్నారు.
గతంలో తాను చేపట్టిన పాదయాత్రలో దేవుడితో పెట్టుకోవద్దు అని చెప్పానని, ఆ మాటలను పట్టించుకోకుండా వ్యవహరించిన వారి పరిస్థితి ఇప్పుడు అందరికీ కనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చిన లోకేష్.. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన లోకేష్.. ‘టీడీపీ జెండా లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ప్రజలే వారి జెండాను పీకేశారు’ అని అన్నారు. ప్రస్తుతం కొందరు ‘రప్పారప్పా’ అంటూ హెచ్చరికలు చేస్తున్నారని.. అయితే తాము చూస్తూ కూర్చోమన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.
అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య తేడాను వివరిస్తూ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాది గూగుల్ అయితే.. వారిది గొడ్డలి. మనది కియా అయితే.. వారిది కిడ్నాప్’ అని విమర్శించారు. అలాగే ‘జగన్ అంటే జెన్-జీ కాదు, జగన్ అంటే గొడ్డలి’ అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు క్రెడిట్ తీసుకునే అలవాటు ఉందని ఆరోపించిన లోకేష్.. ‘రానున్న రోజుల్లో స్వాతంత్ర్యాన్ని కూడా మా తాత తెచ్చాడని జగన్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. దేశానికి వచ్చే ప్రతి రూ.100 పెట్టుబడుల్లో రూ.25 ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.