
- కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్టౌన్/శివ్వంపేట, వెలుగు: మెదక్ఖిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్అన్నారు. గురువారం అధికారులతో ఖిల్లాను కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్ సహకారంతో ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఖిల్లాపై ఉన్న గజశాల, దర్వాజాలు, జైలు.. వంటి చారిత్రక కట్టడాల పరిస్థితిపై ఆరా తీశారు.
జిల్లాలో దొరికిన పురావస్తు విగ్రహాలు, తదితర శాసనాలు, వివిధ అంశాలతో ఖిల్లాపై మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో ఓ రైతు సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన వరి, కూరగాయలు, పండ్ల తోటలను కలెక్టర్ పరిశీలించారు. సేంద్రీయ వ్యవసాయంతో అధిక లాభాలు పొందొచ్చని, రైతులు రసాయనాల వినియోగం తగ్గించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఉన్నారు.