Reading Time: 2 minutes
Amaravati Royals Crush Tungabhadra Warriors By 6 Wickets In Apl 2026

APL 2026: ఏపీఎల్ 2026 సీజన్-5లో అమరావతి రాయల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో రోజు తొలి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన అమరావతి జట్టు 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన తుంగభద్ర వారియర్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. అమరావతి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తుంగభద్ర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేయగలిగారు. ఇన్నింగ్స్ మొత్తం తుంగభద్ర జట్టు సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోతూ 15.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేయగలిగారు. అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. యశ్వంత్ వెంకట్, శశికాంత్ బండారు, అయ్యప్ప చెరో రెండు వికెట్లు తీసి తుంగభద్ర జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

ఇక, 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పవర్‌ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి విజయానికి బాటలు వేసుకుంది. తుంగభద్ర బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అమరావతి బ్యాటర్లు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఎస్‌వీ రాహుల్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు వై సందీప్ కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అతను నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. వీరిరువురి దూకుడు బ్యాటింగ్‌తో అమరావతి రాయల్స్ 11 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో 9 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించి సీజన్‌లో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో తుంగభద్ర వారియర్స్‌ను కంగుతినిపించిన టోషిత్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయనకు అవార్డును అందజేశారు.