Reading Time: 2 minutes
Sangareddy Father Kills Two Children Dies By Suicide At Nizamsagar Dam

టూర్‌కు వెళ్దాం అంటే ఆ పిల్లలు సంతోషంతో తండ్రి వెంట వెళ్లారు. ప్రాజెక్టు అందాలను చూపించి సెల్ఫీలు దిగుతుంటే సంబర పడ్డారు. గోరు ముద్దలు తినిపించి పిల్లలతో కొన్ని గంటల పాటు సరదాగా గడిపిన ఆ తండ్రి.. అంతలోనే విలన్‌గా మారాడు. పిల్లలను డ్యాంలో తోసేసి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి వరకు అమ్మ ఊసు లేకుండా నాన్నతో గడిపిన ఆ చిన్నారులు విగత జీవులుగా మారారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట నుంచి వచ్చి.. నిజాం సాగర్‌లో శవాలుగా మారారు. ఈ ఘటన రెండు జిల్లాల్లో తీవ్ర విషాదం నింపింది.

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలానికి చెందిన బోయి కృష్ణ, తన భార్యా పిల్లలతో కలిసి పఠాన్‌చెరులో మూడు నెలలుగా నివాసం ఉంటున్నాడు. వీరికి 9 ఏళ్ల కొడుకు రక్షిత్, ఐదేళ్ల కూతురు అనన్య ఉన్నారు. కృష్ణ పెయింటర్‌గా పని చేయడంతో పాటు వాచ్ మెన్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య సవిత కూలి పనులు చేస్తోంది. ఐతే భార్య భర్తల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయి. కుటుంబ కలహాలతో భార్య భర్తలు మాట్లాడుకోవడం మానేశారు.

నువ్వు వద్దు అంటూ భార్య.. భర్తతో చెప్పడంతో .. మనస్థాపం చెందిన కృష్ణ… తన కొడుకు, కూతురుతో పాటు టూర్ వెళ్దాం అంటూ నిన్న ఉదయం ద్విచక్ర వాహనంపై నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో పిల్లలతో సరదాగా గడిపాడు కృష్ణ. గోరు ముద్దలు పెట్టాడు. పిల్లలతో సెల్ఫీలు దిగాడు. తెప్పపై నీళ్లు ఉన్న ప్రాంతానికి కొడుకు రక్షిత్, కూతురు అనన్యను తీసుకెళ్లాడు. అదును చూసి.. ఆ పిల్లలను నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాలలో తోసేశాడు. ఆపై తాను దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు బంధువులు ఫోన్ చేస్తే జాగ్రత అంటూ… కృష్ణ ఫోన్ కట్ చేశాడు.

ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంధువుల ఫోన్‌కు సెల్ఫీ ఫోటోలు పంపడంతో.. నిజాం సాగర్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ప్రాజెక్టు దగ్గర బైక్ పార్క్ చేసి చెప్పులు విడిచి .. ఉండటంతో ప్రాజెక్టులో పడి చనిపోయారా అనే అనుమానంతో గజ ఈతగాళ్లతో వెతికించారు. ఒక్కో మృతదేహం విగత జీవులుగా బయట పడటంతో ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. గంట వ్యవధిలో ముగ్గురి మృతదేహాలు బయటకు తెచ్చారు ఈతగాళ్లు. దీంతో నిజాం సాగర్ ప్రాంతం మృతుల బంధువుల రోదనతో మారుమోగింది.

భార్య భర్త మధ్య జరిగిన గొడవలతో మనస్థాపం చెందిన భర్త తన ఇద్దరు పిల్లలు రక్షిత్, అనన్య తో కలిసి బయటకు వెళ్లి వస్తామని చెప్పి విగత జీవులుగా మారారని చిన్నారుల తల్లి రోదించింది. కృష్ణ తన ఇద్దరు పిల్లలతో ప్రాజెక్ట్ వద్ద దిగిన ఫోటోలు వీడియోలు పలువురికి వాట్సాప్ చేసిన అనంతరం డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు పిల్లల్ని ప్రాజెక్టు‌లోకి తోసి.. తాను బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. రెండు జిల్లాల్లో విషాదం నింపింది. భార్య భర్తల గొడవలతో.. భర్త ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. భర్త, పిల్లలను కోల్పోయి భార్య రోడ్డున పడింది.