Reading Time: < 1 minute
I Too Am A Cockroach Ys Jagans Sharp Attack On Government Over Dsc Issue

డీఎస్సీ నియామకాల అంశంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులు యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల యువత నష్టపోతే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా మమ్మల్ని కాక్రోచ్ పార్టీ అని పిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే.. డీఎస్సీ అభ్యర్థులు యువకులు. వారి భవిష్యత్తు, వారి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుతున్నాం. వారికి న్యాయం చేయకపోతే ప్రభుత్వం తన బాధ్యతను ఎలా నిర్వర్తించినట్లు అవుతుంది’ అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ హక్కుల కోసం గళమెత్తడం సహజమని పేర్కొన్నారు. ప్రస్తుతం తరచూ ప్రస్తావనలోకి వస్తున్న ‘జెన్ జీ’ యువత కూడా ఈ వ్యవస్థలో భాగమేనని.. వారి ఆశయాలు, ఆకాంక్షలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించారు. ‘యువత కలలను, ఆశలను నలిపేస్తే కోట్లాది మంది ప్రజలు ఒకేసారి బయటకు వస్తారు. వారిని ఎవరైనా కాక్రోచ్‌లు అని పిలిస్తే, న్యాయం కోసం పోరాడే వారందరూ కాక్రోచ్‌లే అవుతారు. అలాంటి పోరాటంలో నేను కూడా వారిలో ఒకడిని’ అని జగన్ అన్నారు.

డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, యువతకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండబోమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని, వారి భవిష్యత్తుతో ఆటలాడకూడదని సూచించారు. డీఎస్సీ అవకతవకలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దగా పడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుని ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం డీఎస్సీ నియామకాలపై రాష్ట్రంలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.