Reading Time: < 1 minute
Amaravati Outer Ring Road Case High Court Refuses To Halt Construction

Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ సందర్భంగా రహదారి నిర్మాణాన్ని నిలిపివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలి కాలంలో మెజారిటీ ప్రజాహిత వ్యాజ్యాలు రాజకీయ దురుద్దేశాలతో దాఖలవుతున్నాయని పేర్కొంది. ఈ పిల్ కూడా నిజంగా సదుద్దేశంతోనే దాఖలైందా అనే అనుమానం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.

Read Also: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

ఓఆర్‌ఆర్‌ ఎక్కడ నిర్మించాలనే అంశాన్ని ఒక వ్యవసాయదారుడు ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. అయితే, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే, కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన కన్నిగంటి ఆంజనేయ ప్రసాద్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.