
Lashkar Bonalu- Secunderabad: సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. వేకువజామునే అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో జాతర ఘనంగా మొదలైంది. ఆలయ ప్రాంగణమంతా “జై ఉజ్జయిని మహంకాళి” నామస్మరణతో హోరెత్తుతోంది.
సిరిసంపదలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళా భక్తులు నెత్తిపై బోనాలు ఎత్తుకుని పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, సంప్రదాయ డప్పుల మోతలు, జానపద కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు, దర్శనాలతో పాటు ఆలయ పరిసరాల్లో వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, రేపు ఉదయం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘రంగం’ భవిష్యవాణి కార్యక్రమం, అనంతరం గజవాహన సేవ, ఘటాల ఊరేగింపు వైభవంగా సాగనున్నాయి. లక్షలాది మంది భక్తులు, వీఐపీల రాకతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో కళకళలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, సామాన్య భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు నగరం నలుమూలలా సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.