
India Map Controversy: గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత విజయాలు సాధించిన భారత క్రీడాకారులకు ఆతిథ్యమిచ్చిన గ్లాస్గోలోని ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్ మిస్టర్ సింగ్స్ ఇండియా – ద హోమ్ ఆఫ్ కర్రీ (Mister Singh’s India) అనూహ్యంగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. భారత అథ్లెట్ల కోసం సిద్ధం చేసిన పేపర్ నేప్కిన్లపై భారతదేశ మ్యాప్ను తప్పుగా ముద్రించడమే ఈ వివాదానికి కారణమైంది.
మ్యాప్లో నార్త్ ఈస్ట్ మాయం.. గుర్తించిన లవ్లీనా:
కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత భారత క్రీడా బృందానికి రెస్టారెంట్ యాజమాన్యం విందు ఇచ్చింది. ఈ సందర్భంగా డైనింగ్ టేబుళ్లపై పరచిన పేపర్ నేప్కిన్లపై భారత దేశ సరిహద్దు మ్యాప్ను ప్రింట్ చేశారు. అయితే ఆ మ్యాప్లో భారతదేశంలో అత్యంత కీలకమైన ఈశాన్య ప్రాంతాన్ని (North Eastern Region) పూర్తిగా వదిలేసి ముద్రించారు. ఈ ఘోర పొరపాటును భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ వెంటనే గుర్తించి రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీసింది.
జమ్మూ కశ్మీర్ చిత్రీకరణలోనూ పొరపాట్లు:
లవ్లీనా నిరసనకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) అధ్యక్షుడు అజయ్ సింగ్ పూర్తి మద్దతు తెలిపారు. ఆ మ్యాప్ను పరిశీలించిన ఆయన, కేవలం ఈశాన్య భారతం మాత్రమే కాకుండా జమ్మూ కశ్మీర్ సరిహద్దుల చిత్రీకరణలో కూడా పెద్ద తప్పులు చోటు చేసుకున్నాయని ఎత్తి చూపింది. దేశ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న ఆ నేప్కిన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, సరైన భారత మ్యాప్ను ముద్రించాలని ఆయన రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
మిస్టర్ సింగ్స్ ఇండియా:
గ్లాస్గోలో దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ మిస్టర్ సింగ్స్ ఇండియా రెస్టారెంట్ను నాలుగు తరాలుగా సింగ్ కుటుంబం నిర్వహిస్తోంది. పంజాబీ వంటకాలు, స్కాటిష్ శైలి కలయికతో గ్లాస్గోలో ఇది ఎంతో పేరుగాంచిన ల్యాండ్మార్క్.. విదేశీ పర్యటనలకు వచ్చే భారత క్రీడా జట్లు, ప్రముఖులు తరచూ ఈ రెస్టారెంట్ను సందర్శిస్తుంటారు.