
Tirumala Laddu: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదాల్లో అత్యంత ప్రసిద్ధి శ్రీవారి ‘లడ్డూ’. నేటితో (ఆగస్టు 2) ఈ లడ్డూకు 311 ఏళ్లను పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధన పొందిన ఈ పవిత్ర ప్రసాదం కేవలం ఒక ప్రసాదం, తీపి పదార్థం మాత్రమే అని కాకుండా.. శ్రీవారిపై భక్తి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు.
చారిత్రక ఆధారాల ప్రకారం.. 1715 ఆగస్టు 2న తిరుమల ఆలయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి రోజు శ్రీవారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ఈ లడ్డూను ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ ఏడాదితో లడ్డూ ప్రసాదం 311 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
తిరుమలలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీనివాస కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అందించే ప్రధాన ప్రసాదాల్లో శ్రీవారి లడ్డూ ఒకటి. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శెనగపిండి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు వంటి నాణ్యమైన పదార్థాలతో ప్రత్యేక పద్ధతిలో తయారయ్యే శ్రీవారి లడ్డూ తన ప్రత్యేక రుచి, సువాసనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తిరుమలకు వచ్చే విదేశీ భక్తులు సైతం ఈ ప్రసాదాన్ని ఆసక్తిగా తీసుకెళ్తుంటారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు దైవానుగ్రహంగా భావిస్తారు. శ్రీవారి ఆశీస్సులు లభించాయని భావిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఈ ప్రసాదాన్ని పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూ తయారీ విధానం, నాణ్యత, రుచి వంటి అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరతరాలుగా సంరక్షిస్తూ వస్తోంది. సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ కోట్లాది మంది భక్తులకు ప్రతిరోజూ ఈ ప్రసాదాన్ని అందిస్తోంది.