Reading Time: 2 minutes
Us Visa Bond 2026 20000 Dollar Rule Indians

US Visa Rules 2026: అమెరికా ప్రభుత్వం ‘వీసా బాండ్ ప్రోగ్రామ్’ను శాశ్వతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధన ప్రకారం, కొన్ని నిర్దిష్ట దేశాల పౌరులు బిజినెస్ (B-1), టూరిస్ట్ (B-2) వీసాలు పొందడానికి ముందు గరిష్టంగా 20,000 డాలర్లు (సుమారు రూ. 17 లక్షలు) సెక్యూరిటీ బాండ్‌గా జమ చేయాల్సి రావచ్చు. ఈ కొత్త నిబంధన ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అర్హులైన దరఖాస్తుదారులకు వీసా మంజూరు చేసే ముందు వీసా అధికారులు ఈ బాండ్‌ను డిమాండ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుతానికి ఈ నిబంధన 50 దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది, ఇందులో ఎక్కువ భాగం ఆఫ్రికన్ దేశాలే ఉన్నాయి. అయితే భారత్‌కు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. మన దేశం ఈ జాబితాలో లేదు, కాబట్టి భారతీయ పౌరులు B-1, B-2 వీసాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎలాంటి బాండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చవచ్చని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

2025లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం:
అమెరికా ఈ పథకాన్ని 2025లో ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అనధికారికంగా అమెరికాలోనే ఉండిపోయే ధోరణిని (వీసా ఓవర్‌స్టే) నియంత్రించడంలో ఈ బాండ్ విధానం ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఆశించిన మంచి ఫలితాలు రావడంతో, దీనిని ఇప్పుడు శాశ్వత నిబంధనగా అమలు చేస్తున్నారు. ఇది దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల్లో భాగమని భావిస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 5,000, 10,000, 15,000 డాలర్ల బాండ్ ఆప్షన్లు ఉండేవి. అయితే ఇప్పుడు 5,000 డాలర్ల ఆప్షన్‌ను తొలగించి, గరిష్ట బాండ్ మొత్తాన్ని 20,000 డాలర్లకు పెంచారు. ఇక, ఈ నిబంధన వల్ల ప్రయాణికులు వీసా నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని, గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉండరని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, వ్యాపారం లేదా పర్యటన నిమిత్తం వెళ్లే అసలైన ప్రయాణికులపై ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.