
2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనతో కలిపి దాదాపు 15 సార్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఎన్నికల సభలు వేరు.. అధికారిక పర్యటనలు వేరు. కానీ రెండింటిలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులే ప్రధాన అజెండాగా నిలిచాయి. అమరావతి నుంచి భోగాపురం వరకు.. విశాఖ నుంచి భీమవరం వరకు.. ప్రతి పర్యటన వెనుక ఒక ప్రాజెక్టు, ఒక ప్రకటన, ఒక సందేశం కనిపించింది.
2014 నుంచి 2026 వరకూ మోదీ ఏపీ పర్యటనలు
- 2014 – తిరుపతి – విభజన తర్వాత తొలి అధికారిక పర్యటన.
- 2014 – విశాఖపట్నం – హుద్హుద్ తుఫాను నష్టాల పరిశీలన.
- 2015 – అమరావతి – కొత్త రాజధానికి శంకుస్థాపన.
- 2016 – గుంటూరు – అభివృద్ధి కార్యక్రమాలు.
- 2018 – విశాఖపట్నం – పెట్టుబడుల సదస్సు, అభివృద్ధి కార్యక్రమాలు.
- 2019 – తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖలో ఎన్నికల ప్రచారం.
- 2022 – భీమవరం – అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు.
- 2023 – విశాఖపట్నం – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు మద్దతుగా కేంద్ర ప్రాజెక్టులు.
- 2024 – చిలకలూరిపేట, రాజమహేంద్రవరం, అనకాపల్లి, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం.
- 2026 – భోగాపురం – అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం… రూ.18 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం.
ఎందుకు ఈ జిల్లాలే?
మోదీ పర్యటనల్లో ఎక్కువగా కనిపించిన జిల్లాలు.. విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తిరుపతి. ఇవన్నీ ఒకే కథ చెబుతున్నాయి. రాజధాని, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు అంటే.. ఏపీ అభివృద్ధి మ్యాప్లో కీలకమైన ప్రాంతాలే మోదీ పర్యటనల్లో ఎక్కువగా కనిపించాయి.
మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రధాన ప్రాజెక్టులు
- అమరావతి రాజధాని శంకుస్థాపన
- జాతీయ రహదారుల విస్తరణ
- రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి
- పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు
- పెట్రోలియం, ఎరువుల రంగ ప్రాజెక్టులు
- కేంద్ర విద్యా, వైద్య సంస్థల భవనాలు
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
అన్నీ పూర్తయ్యాయా?
కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. అనేక జాతీయ రహదారులు పూర్తయ్యాయి. కొన్ని రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కేంద్ర విద్యా, వైద్య సంస్థలు విస్తరించాయి. అయితే అమరావతి పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. పోలవరం ఇంకా పూర్తికాలేదు. కొన్ని పారిశ్రామిక కారిడార్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. రైల్వే జోన్కు సంబంధించిన అంశాలు పూర్తిస్థాయిలో అమలుకాలేదని విమర్శలు ఉన్నాయి.
భోగాపురం ఎందుకు ప్రత్యేకం?
“ఇది మరో విమానాశ్రయం కాదు.. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త ప్రవేశ ద్వారం అనే చెప్పాలి. విశాఖపై ఉన్న విమాన రద్దీని తగ్గిస్తుంది. కార్గో రవాణాకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది. ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటక రంగానికి ఊతమిస్తుంది. తీర ప్రాంత ఆర్థిక కారిడార్లో కీలక కేంద్రంగా మారే అవకాశముంది. అందుకే ఈ పర్యటనను సాధారణ ప్రారంభోత్సవంగా చూడడం లేదు.
హామీలు.. ఎంతవరకు నెరవేరాయి?
కొన్ని కేంద్ర విద్యా సంస్థలు వచ్చాయి, రహదారులు, మౌలిక వసతుల పనులు జరిగాయి. కానీ ప్రత్యేక హోదా పోలవరం పూర్తి, అమరావతి అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటివి ఇప్పటికీ రాజకీయ చర్చలోనే ఉన్నాయి. కేంద్రం తన వంతు బాధ్యతలు నిర్వర్తించామని చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా హామీలు పూర్తిగా అమలుకాలేదని విమర్శిస్తున్నాయి.
2015లో అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. 2026లో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. పదకొండేళ్ల ప్రయాణంలో ఏపీకి ఎన్నో పర్యటనలు, మరెన్నో శంకుస్థాపనలు..ఇంకెన్నో ప్రారంభోత్సవాలు.. అయితే చివరికి ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే..‘‘ప్రాజెక్టులు ప్రకటించడం కాదు.. అవి పూర్తై ప్రజలకు ఎంత ఉపయోగపడ్డాయి అనేది.
అదే ప్రశ్నకు వచ్చే సమాధానమే.. మోదీ ఏపీ పర్యటనల అసలు విజయాన్ని నిర్ణయించబోతుది. “శంకుస్థాపనలు చరిత్రలో నిలుస్తాయి… పూర్తయిన ప్రాజెక్టులే ప్రజల జీవితాల్లో నిలుస్తాయనేది నిజం.