
Mumbai Indians: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరగనుందంటూ వస్తున్న వార్తలపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి శివమ్ దూబే సహా ఇద్దరు ఆటగాళ్లను ఆఫర్ చేసేందుకు సిఎస్కే సిద్ధమైందంటూ ప్రచారం జోరందుకున్న వేళ, ఈ ఊహాగానాలన్నింటికీ ఎంఐ వర్గాలు చెక్ పెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్తో కానీ లేదా మరే ఇతర ఫ్రాంచైజీతో కానీ ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన రివ్యూ (సమీక్ష) ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అన్ని కోణాల్లో జట్టు ప్రదర్శనను పరిశీలిస్తున్నామని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. సీజన్ సమీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఆటగాళ్ల బదిలీలు లేదా ట్రేడింగ్పై ఒక నిర్ణయానికి రావడం సాధ్యమవుతుందని, ప్రస్తుతానికి ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా సాధించిన విజయాలను ముంబై ఇండియన్స్ సారథిగా హార్దిక్ పునరావృతం చేయలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఈ సీజన్ లో ముంబై ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలం కావడంతో పాటు, డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్ ఆటగాళ్లతో విభేదాలు వచ్చాయనే వార్తలు యాజమాన్యానికి ఇబ్బందిగా మారాయి.
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి తప్పుకోవడంతో అతడు జట్టును వీడటం ఖాయమనే ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సాధారణంగా తన కోర్ టీమ్ను దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఆ కోర్ గ్రూప్లో భాగమే. రాబోయే 2027 సీజన్ తర్వాతే ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో, జట్టులో భారీ మార్పులు చేసే ముందు హార్దిక్కు మరో అవకాశం ఇవ్వడానికే యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక జట్టు ఐకాన్ రోహిత్ శర్మ కూడా 2027 సీజన్ తర్వాత లీగ్కు వీడ్కోలు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.