Reading Time: 2 minutes
Virat Kohli Misses Fifty 49 Anushka Sharma Reaction Rcb Vs Lsg Ipl 2026

RCB vs LSG- Virat Kohli: నిన్న (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ పోరులో ఆర్‌సీబీ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు సులభతరమైన విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తృటిలో ఓ రికార్డును మిస్ చేసుకున్నాడు. తన 66వ ఐపీఎల్ హాఫ్ సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్ వద్ద నికోలస్ పూరన్‌కు చిక్కాడు. కోహ్లీ అవుటైన సమయంలో స్టేడియంలో భార్య అనుష్క శర్మ తీవ్ర నిరాశకు గురైంది. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది.

READ MORE: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ (4/24) నాలుగు వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశాడు. కోహ్లీ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్ కీపర్ జితేష్ శర్మ (23) వేగంగా పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్‌సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ టోర్నీలో తన జోరును కొనసాగిస్తోంది.

READ MORE: Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి