Reading Time: < 1 minute
Friendship Day Tragedy In Visakhapatnam Two Youths Missing At Gangavaram Beach During Rescue Attempt

Friendship Day Tragedy in Visakhapatnam: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సరదాగా గడపాలని వెళ్లిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో సముద్ర అలలు ఇద్దరిని లోనికి లాక్కెళ్లాయి. యువతి నీతూ (18), యువకుడు దామోదర్ గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, బీచ్ లైఫ్‌గార్డులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏడుగురు స్నేహితులు పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. వారిలో నలుగురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారు. బీచ్ సమీపంలో అందరూ కలిసి ఫోటోలు దిగుతుండగా.. జాలరిపేటకు చెందిన నీతూ ప్రమాదవశాత్తు సముద్ర అలల్లో కొట్టుకుపోయింది. ఆమెను గమనించిన పెందుర్తికి చెందిన దామోదర్ వెంటనే సముద్రంలోకి దిగి రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే బలమైన అలల కారణంగా అతడు కూడా గల్లంతయ్యాడు.

గల్లంతైన నీతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. మరోవైపు దామోదర్‌కు కొద్ది రోజులలో కనకమహాలక్ష్మి అనే యువతితో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బీచ్ లైఫ్‌గార్డులతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. సముద్రంలో గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బలమైన అలలు, సముద్ర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. వారిని గుర్తించేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.