Reading Time: 2 minutes
Hyderabad Black Hawks Announce Long Term Volleyball Development Plan

Hyderabad Black Hawks Volleyball Development: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాలీబాల్ క్రీడాభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణను హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి తొలి అడుగుగా విజయవాడలో పీవీఎల్ ఓపెన్ ట్ర య‌ల్స్‌, అండర్-21 ఆటగాళ్ల ఎంపిక (ట్రయల్స్)తో మొద‌లైంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్‌) లోని హైద‌రాబాద్ బ్లాక్ హాక్స్ జ‌ట్టు విజ‌య‌వాడ‌లోని వీఆర్ సిద్ధార్థ యూనివ‌ర్సిటీలో నిర్వహించిన ఈ ట్రయ‌ల్స్ ఉత్సాహంగా జ‌రిగాయి.

ఈ సంద‌ర్భంగా పీవీఎల్ ఓపెన్ ట్రయ‌ల్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా, ర‌వాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి హైద‌రాబాద్ బ్లాక్ హాక్స్ సంస్థ గ‌త నాలుగేళ్లుగా చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్రంలో గ్రాస్ రూట్ స్థాయిలో వాలీబాల్ అభివృద్ధికి బ్లాక్ హాక్స్ నిర్వహించే కార్యక్రమాల‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలందిస్తామ‌ని చెప్పారు.
Untitled 1

శాప్ చైర్మన్ ఎ.ర‌వి నాయుడు మాట్లాడుతూ త‌మ ఆహ్వానాన్ని మ‌న్నించి విజ‌య‌వాడ‌లో పీవీఎల్ ట్రయ‌ల్స్‌ను నిర్వహించిన బ్లాక్ హాక్స్ య‌జ‌మాని అభిషేక్ రెడ్డికి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. తొలి ద‌శ‌లో భాగంగా జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠ‌శాలల్లో, ఆత‌ర్వాత ప్రతి మండ‌లం వాలీబాల్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన బ్లాక్ హాక్స్ కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. వ‌చ్చే సీజ‌న్ పీవీఎల్ పోటీల‌ను విజ‌య‌వాడ‌లో నిర్వహించాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా KSG వ్యవస్థాపకుడు, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రధాన యజమాని అభిషేక్ రెడ్డి కంకనాల మాట్లాడుతూ దీర్ఘకాలిక కార్యాచరణలో భాగంగా ప్రతి ఏడాది టాలెంట్ హంట్‌ను నిర్వహించడం, జిల్లా, గ్రామీణ స్థాయి టోర్నమెంట్‌లకు మద్దతు ఇవ్వడం, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కోచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ప్రొఫెషనల్ స్థాయి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, ముఖ్యంగా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే వాలీబాల్‌ను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఒక్క సంస్థతోనే బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం సాధ్యం కాదు. ప్రభుత్వం, క్రీడా సంఘాలు అందరం కలిసి పని చేస్తే తెలుగు రాష్ట్రాలను దేశంలోనే అత్యంత బలమైన వాలీబాల్ కేంద్రంగా తీర్చిదిద్దగలమ‌న్నారు.

అండ‌ర్‌-21 ట్రయ‌ల్స్‌లో 105 మంది, ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఓపెన్ ట్రయ‌ల్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ ట్రయ‌ల్స్‌లో ప్రతిభ క‌న‌బ‌ర్చిన వారిని ఈనెల 17వ తేదీన గోవాలో జ‌రిగే ఆట‌గాళ్ల వేలంలో పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పెన‌మ‌లూరు శాస‌న స‌భ్యులు బోడే ప్రసాద్‌, శాప్ బోర్డు మెంబ‌ర్ సంతోష్‌, దిగ్గజ వాలీబాల్ క్రీడాకారులు, శాప్ డైరెక్టర్ ఎ.ర‌మ‌ణ‌రావు, టీడీపీ యువ‌జ‌న నాయ‌కులు బోడే వెంక‌ట్రామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇక‌, ఇటీవల ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ (FIVB) ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)ను భారతదేశ తొలి డివిజన్ ప్రొఫెషనల్ వాలీబాల్ లీగ్‌గా గుర్తించిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గుర్తింపుతో అర్హత సాధించిన భారతీయ క్లబ్‌లు సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (CAVA), ఆసియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC), అలాగే FIVB ఆధ్వర్యంలోని అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో అర్హత నిబంధనల ప్రకారం పాల్గొనే అవకాశం లభించనుంది.