Reading Time: 2 minutes
Producer Archana Kalpathi Reveals Why Ravi Mohan And Nayanthara Thani Oruvan 2 Currently On Hold

Thani Oruvan 2: రవి మోహన్, నయనతార జంటగా 2015లో వచ్చిన ‘తని ఒరువన్’ (Thani Oruvan 2) మూవీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో ‘తని ఒరువన్ 2’ను కూడా ఆఫీషియల్ గా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కకపోవడంతో అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత అర్చన కల్పతి దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘తని ఒరువన్ 2’ ప్రస్తుతానికి నిలిచిపోయిందని అర్చన కల్పతి వెల్లడించారు.

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందాల్సి ఉందని, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని తెలిపారు. మార్కెట్ మెరుగుపడిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అందుకే సినిమా పూర్తిగా రద్దు కాలేదని, ప్రస్తుతానికి మాత్రమే పక్కన పెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రవి మోహన్, మోహన్ రాజా, నయనతార తమ తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని అర్చన కల్పతి తెలిపారు. వారి కమిట్‌మెంట్ల కారణంగా కూడా ‘తని ఒరువన్ 2’కు మరింత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంటే ఈ సీక్వెల్‌కు ప్రధాన అడ్డంకిగా ప్రస్తుతం బడ్జెట్, మార్కెట్ పరిస్థితులు, నటీనటుల డేట్స్ వంటి అంశాలే ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి కారణాలుగా ఉన్నాయని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

2015లో వచ్చిన ‘తని ఒరువన్’ కథలో ఐపీఎస్ అధికారి మిత్రన్ పాత్రలో రవి మోహన్ కనిపించారు. వరుసగా జరుగుతున్న అనుమానాస్పద ఘటనల వెనుక ఉన్న పవర్ఫుల్ నెట్‌వర్క్‌ను అతను వెలికితీసే ప్రయత్నం చేస్తాడు. ఆ దర్యాప్తు చివరకు  శాస్త్రవేత్త సిద్ధార్థ్ అభిమన్యు వద్దకు తీసుకెళ్తుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ సిద్ధార్థ్ దాచిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అయితే తన తెలివితేటలతో మిత్రన్‌ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. చివరికి మిత్రన్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని కీలక ఆధారాలను సంపాదించి అతడిని అదుపులోకి తీసుకుంటాడు. తన నెట్‌వర్క్‌కు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు దాచబడ్డాయని సిద్ధార్థ్ వెల్లడించడంతో, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని నిజాన్ని బయటపెట్టేందుకు మిత్రన్ ప్రయత్నిస్తాడు. సిద్ధార్థ్ కథే తనను పోలీస్ వృత్తిలోకి వచ్చేలా ప్రేరేపించిందనే అంశంతో మొదటి భాగం ముగుస్తుంది.

ఆతరువాత ఈ కథకు కొనసాగింపుగా 2019లో ‘తని ఒరువన్ 2’ను ప్రకటించారు. రవి మోహన్ మిత్రన్ పాత్రను, నయనతార తన పాత్రను తిరిగి పోషించనున్నట్లు వెల్లడించారు. మోహన్ రాజా కూడా దర్శకుడిగా కొనసాగుతారని అప్పట్లో ప్రకటించారు. దీంతో మొదటి భాగం అభిమానుల్లో సీక్వెల్‌పై ఆసక్తి భారీగా పెరిగింది. కానీ సంవత్సరాలు గడిచినా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇదిలా ఉంటే రవి మోహన్, నయనతార  వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘తని ఒరువన్ 2’కు అధికారికంగా ముగింపు పలకలేదనే విషయం మాత్రం అభిమానులకు కొంత ఆశ కలిగిస్తోంది. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడి, నటీనటుల డేట్స్ అందుబాటులోకి వస్తే ఈ సీక్వెల్ మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ప్రస్తుతం స్పష్టంగా తెలియడం లేదు.