
Kiren Rijiju-Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్ పర్యటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్ వెళ్లే బదులు రాంచీకి వెళ్లి ఉండాల్సిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. రాహుల్ ఓ పెద్ద తప్పు చేశారని, అయితే మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడంపై కేంద్రం, విపక్షాల మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.
మహిళల భావ ప్రకటన స్వేచ్ఛపై రాహుల్ గాంధీ షేర్ చేసిన ఒక వీడియోపై రిజిజు స్పందిస్తూ, ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఈ రగడ మొదలైంది. దీనికి ప్రతిగా, అసలు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు లంకె పెడుతున్నారంటూ రాహుల్ గాంధీ నిలదీశారు. కాగా, శనివారం (ఆగస్టు 8) ప్రయాగ్రాజ్ చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి ‘ఛాత్రోంకీ గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై, దాని విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే దేశంలో నేడు యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు.
తన ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలపై మాట్లాడాలనుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. అవి – బాధ, డేటా, సంపద. యువత పడుతున్న బాధలు, వారు ఉత్పత్తి చేస్తున్న డేటా గురించి తాను మాట్లాడుతున్నానని, అయితే అసలు సమస్య ఏమిటంటే.. యువతకు చెందాల్సిన సంపద ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా వారికి అందడం లేదని అన్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ చూడటం 21వ శతాబ్దపు ఒక కొత్త రకం వ్యసనంగా మారిందని విమర్శించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి చదువుకున్నా ఉద్యోగాలు రాకపోవడంతో, బ్లింకిట్, ఉబెర్ వంటి కంపెనీల్లో రోజుకు పది గంటల పాటు రోజువారీ కూలీల్లా పనిచేయాల్సి వస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.