భారతదేశంలో ఆస్తి పంపకాలకు సంబంధించి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అన్నాచెల్లెళ్లు మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఆస్తి తమకే చెందుతుందంటూ కోర్టు కేసుల వరకు వెళుతుంటారు. వారసుల విషయంలో ఆస్తి వివాదాలు చాలా కుటుంబాల్లో సాధారణంగా మారిపోయాయి. అయితే ఇద్దరు వారసులు ఉంటే.. పెద్ద కొడుక్కి తండ్రి ఆస్తిలో అధిక భాగం దక్కుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. దీంతో తండ్రి మరణిస్తే పెద్ద కుమారుడికి ఎక్కువ ఆస్తి లభిస్తుందని అంటూ ఉంటారు.
తండ్రి ఆస్తిలో పెద్ద కుమారుడికి ఎక్కువ వాటా లభిస్తుందనేది మన సాంప్రదాయంలో పాతుకుపోయింది. ఈ విషయంలో తరచుగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు తీసేంతవరకు ఈ గొడవలు వెళ్తుంటాయి. అయితే ఇది చట్టంలో నిజంగా ఉందా..? భారతదేశ చట్టాలు ఆస్తుల పంపకాల విషయంలో ఎలా ఉన్నాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పెద్ద కుమారుడికి ఎక్కువ ఆస్తి దక్కుతుందనేది చట్టాల్లో ఎక్కడా లేదు. ఆస్తి పంపకాలు అనేవి వంశపారంపర్యంగా వచ్చాయా.. లేదా తండ్రి కష్టార్జితమా, వీలునామా, వ్యక్తి మతం అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత చట్టాల ప్రకారం పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో కొడుకులు, కూతుళ్లకు సమాన వాటా ఉంటుంది. అంతేకానీ పెద్ద కుమారుడికి మొత్తం లేదా అధిక భాగం దక్కుతుందనే నిబంధన ఎక్కడా లేదు. కేవలం ఆచారం ద్వారా మాత్రమే ఈ నమ్మకం ఏర్పడింది.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్తిలో కొడుకులు, కూతుళ్లకు సమాన హక్కులు ఉంటాయి. అయితే చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ఆస్తులను పంచుకోవాల్సి ఉంటుంది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. దీంతో ఆస్తి అనేది ప్రాథమిక హక్కు కిందకు రాదు. కేవలం చట్టపరమైన హక్కుగానే ఉంటుంది.
కేవలం చట్టబద్దమైన ప్రక్రియ ద్వారా మాత్రమే ఆస్తి పంపకాలు చేపట్టాలి. చట్టబద్దంగా తప్పితే ఒకరి ఆస్తిని ఇంకోకరు హరించలేరు. చట్టాల గురించి అవగాహన లేక చాలామంది కోర్టు కేసుల వరకు వెళ్తుంటారు. ఈ గొడవలు కుటుంబ విలువలను చిన్నాభిన్నం చేస్తాయి. చట్టాల గురించి అవగాహన ఉంటే అలాంటి గొడవలు అనేవి ఉండవు.




